జమిలీ ఎన్నికల పేరిట సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ
లోక్సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనను ప్రధాని మోదీ ముందుకు తెచ్చిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: లోక్సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనను ప్రధాని మోదీ ముందుకు తెచ్చిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై జాతీయ స్థాయిలో చర్చ ప్రారంభమైంది.
చట్టపరంగా కొన్ని మార్పులు చేయడంతోపాటు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకుంటే లోక్సభ, శాసనసభలకు ఎన్నికలు సులభమేనని ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి.
జమిలి ఎన్నికలు నిర్వహించడం అంటే లోక్సభకు, అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకే సమయంలో ఎన్నికలు జరుపడం. ఆయా ప్రభుత్వాల కాలపరిమితి ఒకే రోజున తీరాల్సి ఉంటుంది. భారతదేశం 1950లో రిపబ్లిక్ మారిన తర్వాత 1952లో తొలిసారి దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగాయి.
దేశంలో జమిలి ఎన్నికల ప్రక్రియ తొలి లోక్సభ, రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మొదలైంది. నాలుగో లోక్సభకు ఆటంకం కలిగేంత వరకూ జమిలి ఎన్నికలు కొనసాగాయి. ఆ తర్వాత కేంద్రంలో ఆయా రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక్కో రాష్ర్టానికి ఒక్కో కాలపరిమితి ఏర్పడుతూ వచ్చింది.
కాలక్రమంలో కొన్ని రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల గడువు లోక్సభ గడువు కలువడంతో లోక్సభతోపాటే అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 2014లో ఏపీ, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ర్టాలకు ఇదే కోవలో ఏకకాలంలో ఎన్నికలు జరిగాయి.
తేలాల్సిన అంశాలెన్నో ఉన్నాయి.
కేరళలో తొలి ప్రభుత్వం రద్దు
తొలిసారి 1953లో కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం రద్దయింది. ఆ మాటకు వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రకాశం పంతులు ప్రభుత్వం మద్య నిషేధం అమలుకు కోసం ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు పలుకడంతో ఆ ప్రభుత్వం పతనమైంది. తిరిగి వెంటనే 1955లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1956లో హైదరాబాద్, ఆంధ్రా రాష్ట్రాల కలయికతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగింది. 1983 వరకూ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, లోక్ సభకు ఉమ్మడిగా ఎన్నికలు ఒకేసారి జరిగాయి.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసిన జనతా ప్రభుత్వం
1978లో ఇందిరాగాంధీ నియంత్రుత్వ విధానానికి వ్యతిరేకంగా జత కట్టిన జనతా పార్టీ ఆధ్వర్యంలో కొలువుదీరిన మొరార్జీ దేశాయి ప్రభుత్వం.. కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. అంతే కాదు. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత దిగజారిన శాంతిభద్రతల పేరిట ప్రతిపక్ష ప్రభుత్వాలను రద్దు చేసింది. 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం.. 1984లో నాదేండ్ల కుట్ర, ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరిట దేశ వ్యాప్త ఉద్యమం తర్వాత తిరిగి సీఎంగా ఎన్టీఆర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయన మళ్లీ ప్రజాతీర్పు కోసం అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ప్రజాతీర్పు కోరారు. దీంతో 1985లో ఉమ్మడి ఏపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి.

1989లో ఎన్టీఆర్ ఓటమి
1989లోనూ లోక్సభతోపాటు ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన ఎన్టీఆర్ ఓటమి పాలయ్యారు. తిరిగి 2004లోనూ నాటి సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడంతో అప్పటి ప్రధాని ఏబీ వాజ్ పేయి లోక్ సభకూ ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఓటమి పాలయ్యారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఏపీలో, తర్వాత తెలంగాణలోనూ లోక్ సభ, అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి.
1991లో అకారణంగా డీఎంకే సర్కార్కు ఉద్వాసన
1989లో ఎంజీఆర్ మరణించిన తర్వాత అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలతో ప్రభుత్వం పతనమైంది. తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డీఎంకే గెలుపొందినా 1991 ఎన్నికలకు ముందు ఎటువంటి కారణం లేకుండానే నాటి రాజీవ్ గాంధీ సూచనతో కరుణానిధి ప్రభుత్వాన్ని అప్పటి చంద్రశేఖర్ ప్రభుత్వం రద్దుచేసింది. 2000లో బీహార్లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని కూల్చేందుకు వాజ్ పేయి ప్రభుత్వం విఫలయత్నం చేసింది. పరిస్థితులు ఇలా ఉంటే తాజాగా లోక్ సభ, అసెంబ్లీలకు జమిలీ ఎన్నికలు జరుపాలని ప్రధాని మోదీ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. నిజానికిది తొలిసారి వచ్చిన ప్రతిపాదనేమీ కాదు. అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలోనూ ఇదే ప్రతిపాదన తెచ్చారు. దానికి నాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు సమర్థించారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గడంతోపాటు ఐదేళ్ల పాటు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే నాథుడే లేని పరిస్థితులు నెలకొంటాయి.
జమిలీ ఎన్నికలు సాధ్యమేనా?
ఇదిలా ఉంటే ఏడాది క్రితమే ఎన్నికలు జరిగిన రాష్ట్రాల అసెంబ్లీలకు తిరిగి ఎన్నికల నిర్వహణకు ఆయా ప్రభుత్వాలు సిద్ధపడతాయా? అన్న అంశం జమిలి ఎన్నికల నిర్వహణలో కీలకమైనది. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో రాష్ర్టాల్లో ప్రభుత్వాలను ఎన్నుకునే విషయంలో ఓటరు తీర్పులో తేడా ఉంటుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. లోక్సభకు ఒక పార్టీని గెలిపించే వాటితోపాటే జరిగిన రాష్ట్ర అసెంబ్లీలకు వేరొక పార్టీని గెలిపించిన ఉదంతాలు కోకొల్లలు. ఈ క్రమంలో లోక్సభకు, అసెంబ్లీలకు ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రాంతీయ పార్టీలు అంగీకరిస్తాయా? అనేది సమస్య. సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో అవి రాష్ట్ర స్థాయిలోనైనా, లేదా కేంద్ర స్థాయిలోనైనా మెజారిటీ కోల్పోయిన పక్షంలో ఏం చేయాలి? ఒకసారి ఎన్నికైన ప్రభుత్వానికి మెజారిటీతో సంబంధం లేకుండా ఐదేండ్లు పాలించే అవకాశం ఇస్తారా? అనేది మరో అంశం. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతోపాటు అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించగలిగే పరిస్థితి ఎన్నికల కమిషన్కు ఉంటుందా? అనేది మరో చర్చనీయాంశం.
గణనీయంగా తగ్గనున్న ఖర్చు
ఎన్నికలనగానే భారీ ఎత్తున ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అభ్యర్థులు చేసే ఖర్చుపై గరిష్ఠపరిమితి ఉన్నప్పటికీ.. అనధికారికంగా కోట్లకొద్దీ నల్లధనం మార్కెట్లోకి ప్రవహించేది ఆ సమయంలోనే. జమిలి ఎన్నికలతో ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చనే అభిప్రాయం ఉంది. జమిలి ఎన్నికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు.ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత పూర్తి అవినీతిమయంగా మారినా, లేదా ప్రజాభిప్రాయానికి భిన్నంగా పాలిస్తున్నా అప్పుడేం చేయాలనేది మరో ప్రశ్న. అది ప్రజాస్వామిక సిద్ధాంతాలకు విఘాతం కల్గిస్తుందా? అనే చర్చ కూడా ఉన్నది.
నియమావళి నుంచి విముక్తి
ప్రతియేటా గరిష్ఠంగా ఐదు రాష్ర్టాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతున్నది. ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చుననే అభిప్రాయం ఉంది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అన్న నినాదం దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కల్గిస్తుందనే సిద్ధాంతాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ప్రభుత్వాల ఏర్పాటు విషయంలో రాజ్యాంగం ఆయా రాష్ర్టాలకు కొన్ని హక్కులు కల్పించింది. జమిలి ఎన్నికలంటే వాటి హక్కులను ఉల్లంఘించడమేనన్న వాదన వినిపిస్తున్నది. ఇప్పటి వరకు జరిగిన భారత దేశంలో 1952 నుంచి సమాఖ్య స్ఫూర్తి ప్రతిబింబిస్తూ వచ్చింది. రాజకీయ విభేదాలు ఉన్నా.. వివిధ కారణాలతో జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య ఘర్షణ కొనసాగినా అదే సమాఖ్య స్ఫూర్తి కొనసాగుతూ వచ్చింది. కానీ ప్రస్తుతం మారిన జాతీయ రాజకీయాల పరిస్థితుల్లో ఏక కాలంలో ఎన్నికల నిర్వహణ ప్రతిపాదన ముందుకొచ్చింది.
అనేకం జమిలి ఉదంతాలు!
1989 సాధారణ ఎన్నికల నుంచి వేర్వేరు రాష్ర్టాల్లో జమిలి ఎన్నికలు నిర్వహించిన ఉదంతాలు 31 వరకూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (1989, 1999, 2004, 2009, 2014), ఒడిశా (2004, 2009, 2014), కర్ణాటక (1989, 1999, 2004), సిక్కిం (2009, 2014), తమిళనాడు (1989, 1991, 1996), మహారాష్ట్ర (1999), అసోం (1991, 1996), హర్యానా (1991, 1996), కేరళ (1989, 1991, 1996), ఉత్తరప్రదేశ్ (1989, 1991), పశ్చిమబెంగాల్ (1991, 1996), అరుణాచల్ప్రదేశ్ (2009, 2014), తెలంగాణ (2014) రాష్ర్టాలు జమిలి ఎన్నికలను చూసినవే.












Click it and Unblock the Notifications