రష్యాతో చర్చలు సక్సెస్: రాజ్నాథ్ ప్రకటన.. భారత సైనికులకూ నివాళి.. రేపు చైనాతో ఫేస్ టు ఫేస్..
రక్షణ రంగంలో భాగస్వామ్యానికి సంబంధించి రష్యా ప్రభుత్వాధినేతలు, సైనిక అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ కు చిరకాల మిత్రుడైన రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా చర్చల్లో కీలక అంశాలను ప్రస్తావించానని, భారత్ ప్రతిపాదను అన్నిటికీ రష్యా అంగీకారం తెలిపిందని ఆయన చెప్పారు. భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ రాజ్ నాథ్ రష్యా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

గాంధీజీకి నివాళులతో..
రష్యా రక్షణ శాఖ ఆహ్వానం మేరకు మూడురోజుల పర్యటన కోసం మాస్కో చేరుకున్న రాజ్ నాథ్ కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. మంగళవారం మాస్కోలోని ఇండియన్ ఎంబసీని సందర్శించిన ఆయన.. అక్కడి గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించడంతో తన కార్యక్రమాలు ప్రారంభించారు. రష్యా ఉప ప్రధాని యూరీ ఇవనోవిచ్ బోరిసోవ్ తోపాటు ఆ దేశ రక్షణ శాఖ అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చర్చల సారాన్ని వివరించారు.

భారత జవాన్ల త్యాగాలు మరువలేం..
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై రష్యా విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో రష్యా మిలటరీ నేతృత్వంలో బుధవారం భారీ పరేడ్ జరుగనుంది. ఇందులో భారత్, చైనా సహా 11 దేశాల సైనికుల బృందాలు కూడా పాల్గొంటున్నాయి. విక్టరీ డే పరేడ్ చారిత్రక నేపథ్యాన్ని గుర్తుచేస్తూ.. ‘‘నాటి ప్రపంచ యుద్ధంలో రష్యా తరఫున వందలాది మంది భారత జవాన్లు కూడా పోరాడారు. శాంతి స్థాపన కోసం వారు చేసిన త్యాగాలు మరువలేనివి''అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. కరోనా విజృంభణ తర్వాత భారత ప్రతినిధి బృందం తొలి పర్యటన రష్యాలో జరుగుతుండటం రెండు దేశాల స్నేహబంధానికి ఒక నిదర్శనమని ఆయన తెలిపారు.

ఎస్-400 డెలివరీ ఎప్పుడంటే..
స్వాతంత్ర్యం తరువాత నుంచి భారత్ తన రక్షణ అవసరాల కోసం రష్యా నుంచే ఎక్కువగా ఆయుధాలు కొనుగోలు చేస్తుండటం తెలిసిందే. అత్యాధునిక ఎస్-400 క్షిపణి నిరోధక వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి రష్యాతో భారత్ 540 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకోగా.. ఆ పరికరాల డెలివరీ వాయిదా పడుతూ వచ్చింది. మంగళవారం నాటి భేటీలో రాజ్ నాథ్ బృందం ఈ అంశాన్ని ఆరా తీయగా.. వచ్చ డిసెంబర్ నాటికి డెలివరీ ఇస్తామని రష్యా ప్రతినిధులు చెప్పారు. అయితే, సాధ్యమైనంత తొందరగా పని పూర్తి చేయాల్సిందిగా రాజ్ నాథ్ కోరారు. అలాగే, అలాగే సుఖోయ్, మిగ్ విమానాలకు అవసరమైన విడిభాగాల సరఫరాను కూడా వేగవంతం చేయాలని ఆయన సూచించారు.

రేపు చైనా రక్షణ మంత్రితో..
భారత్, చైనా మధ్య ఉద్రిక్తలు నెలకొన్నవేళ రెండు దేశాల రక్షణ మంత్రులు ఫేస్ టు ఫేస్ కలవనున్నారు. మాస్కోలోని రెడ్ స్క్వేర్ లో బుధవారం జరుగనున్న విక్టరీ పరేడ్ లో రాజ్ నాథ్ సింగ్, చైనా డిఫెన్స్ మినిస్టర్ యీ ఫఎంగీ కలిసి పాల్గొననున్నారు. వాళ్లిద్దరి మధ్య జరగబోయే సంవాదం ఎలా ఉంటుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Recommended Video

భారత్-చైనాపై రష్యా కామెంట్..
సరిహద్దులో భారత్, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తలు తగ్గేలా.. ద్వైపాక్షికంగానే సమస్యలు పరిష్కరించుకోగలవని, మూడో పక్షం అవసరం లేదని రష్యా స్పష్టం చేసింది. మాస్కో వేదికగా రష్యా-భారత్-చైనా విదేశాంగ శాఖల మంత్రుల కీలక సమావేశం మంగళవారం జరిగింది. చర్చల అనంతరం రష్యా విదేశాంగ మంత్రి లవరోవ్, భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, చైనా విదేశాంగ మంత్రి వాగ్ యీ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం ద్వారా.. కాలపరీక్షను ఎదుర్కొని నిలబడిన అంతర్జాతీయ సూత్రాలలపై నమ్మకం పెరిగినట్లయిందని, చేసుకున్న నిబంధనలను అన్ని దేశాలూ గౌరవించాల్సిన అవసరం ఉందని మంత్రి జైశంకర్ అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదని చైనాకు పరోక్షంగా చురక వేశారు.












Click it and Unblock the Notifications