అక్కడ దిశా సీన్ రిపీట్: అత్యాచార నిందితుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఎన్కౌంటర్ తరహా ఘటన ఇప్పుడు అస్సాం రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఒక పశు వైద్యురాలిని నలుగురు అగంతకులు అత్యంత అమానవీయంగా అత్యాచారం చేసి ప్రాణాలు తీసిన ఘటనలో తెలంగాణ పోలీసులు ఒక అడుగు ముందుకు వేసి నలుగురు మానవ మృగాలను ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మహిళలంతా తెలంగాణా పోలీసులపై ప్రశంసల వర్షం కురిపిస్తే, ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకించిన వారు కూడా లేకపోలేదు. దోషులని తేలకముందే శిక్షించారని, అత్యాచార నిందితుల కుటుంబాలు పోలీసుల తీరుపై ఆరోపణలు చేశారు. దిశ ఎన్కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమీషన్ ను వేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే అస్సాం రాష్ట్రంలో దిశ ఎన్కౌంటర్ ఘటన తరహా అత్యంత భయానక సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ప్రకారం, అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పోలీసుల ఎన్కౌంటర్ లో మృతి చెందాడు.
అత్యాచార నిందితుడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా, నిందితుడు పోలీసులపై కాల్పులు జరిపారని,దానికి ప్రతిగా పోలీసులు కూడా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఎన్కౌంటర్లో అత్యాచార నిందితుడిని పోలీసులు హతమార్చినట్టు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు మహిళా పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఒక అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీ నుండి పారిపోవడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసు కాల్పుల్లో మరణించాడని తెలుస్తుంది.
సదరు అత్యాచార నిందితుడు మంగళవారం రాత్రి గౌహతిలో పోలీసు సిబ్బందిపై దాడి చేశాడు. అదే రోజు అతన్ని అరెస్టు చేశారు. తప్పించుకొని పారిపోతూ పోలీసులపై దాడి చేసిన క్రమంలో ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని గౌహతి సిటీ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు మహిళా సిబ్బందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు, అత్యాచార నిందితుడి హత్యకు సంబంధించి అస్సాం పోలీసుల ఆపరేషన్ గురించి ఎటువంటి వివరణాత్మక సమాచారం వెల్లడి కాలేదు. నిందితుడి గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ ఘటనలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.