JNU violence: వీసీ తొలగింపునకు నిజనిర్ధారణ కమిటీ సిఫార్సు.. సెమిస్టర్ ఫీజు గడువు పెంపు..
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో హింసాత్మక ఘటనల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, ఈ విషయంలో వైస్ చాన్సలర్ జగదీశ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. వీసీని వెంటనే తొలగించాలనీ కమిటీ సిఫార్సు చేసింది. ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ ఏర్పాటుచేసిన నిజనిర్ధారణ కమిటీ ఆదివారం తన రిపోర్టును వెలువరించింది.
జేఎన్ యూలో హింసాత్మక ఘటనల వెనుక వీసీ జగదీశ్ ప్రమేయాన్ని కూడా కొట్టిపారేయలేమని, ఆయనపై దర్యాప్తు జరపాల్సిందేననీ కాంగ్రెస్ కమిటీ వ్యాఖ్యానించింది. వీసీగా జగదీశ్ నియమితులైన తీరు, ఆయన పదవి చేపట్టిన తర్వాత జేఎన్ యూలో చేపట్టిన నియామకాలతోపాటు, తీసుకున్న అన్ని రకాల నిర్ణయాలపైనా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పేర్కొంది. వర్సిటీకి సెక్యూరిటీ కల్పిస్తోన్న ప్రైవేటు సంస్థపైనా చర్యలు ఉండాల్సిందేనని సూచించింది.

ఫీజు గడువు పెంపు..
ఏ వివాదమైతే వర్సిటీలో ఉద్రిక్తతలకు దారి తీసిందో.. ఆ ఫీజుల వ్యవహారంపై వెనక్కి తగ్గబోయేదిలేదని జేఎన్ యూ వీసీ జగదీశ్ స్పష్టం చేశారు. వింటర్ సెమిస్టర్ ఫీజుల చెల్లింపునకు గడువును ఈ నెల 15 వరకు పొడగిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకుముందు గడువు ఈ నెల 7 వరకే ఉండేది. ఫీజుల పెంపు నిర్ణయం ఉద్దేశపూర్వకంగా తీసుకున్నది కాదని వీసీ చెప్పారు. ఫీజుల పెంపుతో పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్న లెఫ్ట్ సంఘాలు.. ఫీజుల తగ్గింపు కోసం చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారడం, దానికి కొనసాగింపుగా ఈ నెల 5న ముసుగు దుండగులు లెఫ్ట్ విద్యార్థులపై దాడులకు పాల్పడటం తెలిసిందే.












Click it and Unblock the Notifications