ప్రమాదకరంగా పరిస్థితులు: నాగాలాండ్లో ఆరు నెలలపాటు AFSPA పొడిగింపు
న్యూఢిల్లీ/కోహిమా: ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్లో వివాదాస్పదంగా మారిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఫ్ఎస్పీఏ) అమలును కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ఆరు నెలలపాటు పొడిగించింది. రాష్ట్రాన్ని కల్లోలిత ప్రాంతంగా పేర్కొన్న కేంద్రం.. స్థానికంగా పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ చట్టం అమలును మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
డిసెంబర్ 4న ఇక్కడి మోన్ జిల్లాలో భద్రతా బలగాల కాల్పుల ఘటనలో 14 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన క్రమంలో సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నాగాలాండ్ ప్రభుత్వంతోపాటు స్థానికుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చాయి. ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ నాగాలాండ్ అసెంబ్లీ డిసెంబర్ 21న ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీలు కూడా చట్టం రద్దుకు డిమాండ్ చేశాయి. అయితే, ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొంది.
తాజాగా చట్టాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ చట్టం అమలులో ఉండనుంది. కాగా, రాష్ట్రంలో ఈ చట్టం ఉపసంహరణ అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.