ఎన్నికలు బహిష్కరించిన ఐఏఎస్ డికే రవి ఫ్యామిలి
బెంగళూరు: మా కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు తాము ఎందుకు ఈ ఎన్నికలలో ఓట్లు వెయ్యాలని ఐఏఎస్ అధికారి దివంగత డికే రవి కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకి తాము మద్దతు ఇవ్వమని, ఎన్నికలు బహిష్కరిస్తున్నామని వారు తేల్చి చెప్పారు.
మంగళవారం గ్రామ పంచాయితీ ఎన్నికలు జరిగాయి. తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలోని దోడ్డకోప్పలు గ్రామంలో డికే. రవి కుటుంబ సభ్యలు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. వీరు కూడవత్తి గ్రామ పంచాయితీకి జరిగిన ఎన్నికలలో ఓట్లు వేయవలసి ఉంది.
అయితే రవి కుటుంబ సభ్యులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ సందర్బంలో రవి సోదరుడు డికే రమేష్ మీడియాతో మాట్లాడారు. సిన్సియర్ ఐఏఎస్ అధికారి అని పేరు తెచ్చుకుని నిజాయితీగా పని చేస్తున్న తన తమ్ముడు డికే. రవి అనుమానాస్పద స్థితిలో మరణించారని గుర్తు చేశారు.
రవి గురించి ఈ రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మమ్మల్ని క్షోభకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి రాజకీయ నాయకులకు బుద్ది చెప్పడానికి మా కుటుంబ సభ్యులు ఎన్నికలను బహిష్కరించారని చెప్పారు. రవి కుటుంబ సభ్యులకు ఐదు ఓట్లు ఉన్నాయి.
మాకు న్యాయం జరిగే వరకు ఎలాంటి ఎన్నికలలో పాల్గోనమని, ఏ రాజకీయ నాయకుడిని నమ్మమని అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటి చేస్తున్న అభ్యర్థులు మా ఇంటికి వచ్చి మద్దతు తెలపాలని మనవి చేశారని, ఓట్లు వెయ్యాలని చెప్పారని రమేష్ ఇదే సందర్బంలో గుర్తు చేశారు.