శశికళకు పరాభవం తప్పదు.. కొద్ది రోజుల్లో డీఎంకె చేతికి పగ్గాలు: అన్బగళన్
కొద్దిరోజుల్లోనే డీఎంకె చేతిలోకి రాష్ట్ర పగ్గాలు వెళ్తాయని ఎమ్మెల్యే అన్బళగన్ జోస్యం చెప్పారు.
చెన్నై: నాటకీయ పరిణామాల నడుమ.. మొత్తానికి సీఎం కుర్చీలో కూర్చోవడానికి శశికళ రెడీ అయిపోయారు. అత్యంత సాధారణ స్థాయి నుంచి సీఎం దాకా ఆమె ఎదిగిన వైనంపై పలు భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి.
సీఎంగా శశికళ శకం ప్రారంభమవగా.. ఒక్క ప్రమాణ స్వీకారం మాత్రమే బాకీ ఉంది. పార్టీలో, ప్రభుత్వంలో శశికళ నిర్ణయం పట్ల అందరూ విధేయతతోనే ఉండటంతో ఇక ఆ కార్యక్రమం కూడా లాంఛనమే.
ఇలాంటి తరుణంలో డీఎంకె ఎమ్మెల్యే అన్బళగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల్లోనే డీఎంకె చేతిలోకి రాష్ట్ర పగ్గాలు వెళ్తాయని ఆయన జోస్యం చెప్పారు. చేపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అన్బళగన్ రాష్ట్రంలో పరిణామాలపై మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు పరాభవం తప్పదని అన్బగళన్ అన్నారు. రు. దివంగత జయలలిత కూడా శశికళను తన సన్నిహితురాలిగానే చూశారే తప్ప... పార్టీలో చిన్న పదవి కూడా ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు.
జయ మరణం తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న కోరికను శశికళను నెరవేర్చుకున్నారని అన్బగళన్ పేర్కొన్నారు. జయ మరణంపై న్యాయ విచారణ చేపట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.
'అన్న' వర్థిల్లాలి.. 'అమ్మ' వర్థిల్లాలి': శశికళ నినాదం
సీఎం పదవిని చేపట్టబోతున్న తరుణంలో పన్నీర్ సెల్వంపై శశికళ ప్రశంసలు కురిపించారు. కష్ట సమయాల్లో అటు పార్టీకి, ఇటు అమ్మకు అత్యంత విశ్వాసనీయుడిగా సోదరుడు పన్నీర్ సెల్వం ఉన్నారని ప్రశంసించారు.
జయ ఆదేశానుసారం, ఆమె ఏం నిర్దేశిస్తే అదే చేశారని చెప్పుకొచ్చారు. పన్నీరు సెల్వం కోరిక మేరకే తాను శాసనసభాపక్షనేతగా ఎన్నికయ్యానని శశికళ తెలిపారు. ప్రజల కోసమే ప్రభుత్వం అనే విధానాన్ని కొనసాగిస్తామని హామి ఇచ్చారు.
పార్టీ నేతలు తనపై ఉంచిన నమ్మకాన్ని కర్తవ్యంతో నిర్వహిస్తానని, బాధ్యతను తప్పక పాటిస్తానని చెప్పుకొచ్చిన శశికళ.. చివరలో 'అన్న' వర్థిల్లాలి.. 'అమ్మ' వర్థిల్లాలి' అంటూ నినాదాలు చేయడం గమనార్హం.