‘‘మీరు, నేను ఎవరం? పార్టీయే అంతా, మీరిలాగే చేస్తే.. నేను 2019లో చూసుకుంటా’’
పార్లమెంట్కు డుమ్మా కొట్టే బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇలాగే డుమ్మా కొడితే..
న్యూఢిల్లీ: పార్లమెంట్కు డుమ్మా కొట్టే బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగే ఇచ్చారు. ఇలాగే డుమ్మా కొడితే.. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వనని మోడీ స్పష్టం చేసినట్లు సమాచారం.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోడీ.. ఈ సందర్భంగా డుమ్మా కొట్టే ఎంపీలపై సీరియస్ అయ్యారు. వ్యక్తి కంటే పార్టీయే ఉన్నతమైనదని, ఎంపీలు పార్లమెంట్కు రావాల్సిన అవసరంపై వాళ్లకు వివరించాలని ఆయన సూచించారు.
ఎంపీలు కచ్చితంగా హాజరయ్యేలా విప్ జారీ చేయాల్సిన అవసరం రాకూడదని మోడీ స్పష్టంచేశారు. 'మీరు, నేను అసలు ఎవరం? పార్టీయే అంతా. మీరు ఏం కావాలంటే అది చేసుకోండి.. నేను 2019లో చూసుకుంటా..' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి నుంచి అమిత్షా కూడా పార్లమెంట్లో ఉంటారని, ఇక వాళ్లంతా కచ్చితంగా రావాల్సిందేనని మోడీ స్పష్టంచేశారు. అమిత్ షా రాజ్యసభకు ఎన్నికైన తర్వాత జరిగిన తొలి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇది. ప్రతిపక్షంలో ఉన్నపుడు పార్టీని నడపడం సులువేనని, అయితే అధికారంలో ఉన్నపుడు అది వేరని మోడీ ఎంపీలకు చెప్పారు.