హృదయ విదారకం : ఆసుపత్రిలో ఆ తల్లిని పట్టించుకున్న నాథుడే లేడు.. కొడుకు చేతుల్లోనే కన్నుమూత..
ఉత్తరప్రదేశ్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఓ మహిళ వైద్యుల నిర్లక్ష్యానికి బలైపోయింది. ఆసుపత్రికి తీసుకొచ్చాక.. ఒక్కసారి కూడా వైద్యులు గానీ,మెడికల్ స్టాఫ్ గానీ ఆమె వద్దకు వెళ్లలేదు. సమస్య తీవ్రమవుతోందని ఆమె కొడుకు పలుమార్లు వైద్యుల వద్దకు పరిగెత్తుకెళ్లినా పట్టించుకోలేదు. దీంతో శ్వాస ఆగిపోతున్న తన తల్లిని బతికించుకోవడానికి తానే సీపీఆర్ చేశాడు. ఆమె ఛాతిపై బలంగా చేతులతో ఒత్తిడి పెంచుతూ తల్లి గుండె ఆగిపోకుండా తనవంతు ప్రయత్నం చేశాడు. కానీ చివరకు కొడుకు చేతుల్లోనే ఆ తల్లి తుది శ్వాస విడిచింది. తుది శ్వాస విడిచే ముందు ఆమె చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా కంటనీరు తెప్పించేలా ఉన్నాయి.
ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ ఆసుపత్రికి..
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకు చెందిన మమతా శర్మ (61) మూడేళ్లుగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఆదివారం రాత్రి సమస్య తీవ్రం కావడంతో.. ఆమె కుమారుడు మోహిత్ శర్మ ఆగ్రాలో అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తీసుకొచ్చాడు. మొదట తనను సర్జికల్ వార్డుకు తీసుకెళ్లానని.. అక్కడ ఓ వైద్యుడు సమస్య గురించి అడిగి తెలుసుకుని.. మరో గదిలోకి పంపించాడని మోహిత్ తెలిపాడు. అక్కడ మరో వైద్యుడితో మాట్లాడానని.. తన తల్లి అనారోగ్యానికి కోవిడ్-19 కారణం కాదని, ఆమె గత మూడేళ్లుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతోందని అతనితో చెప్పినట్టు పేర్కొన్నాడు.
ఆక్సిజన్ సిలిండర్స్ తానే పెట్టాలన్న వైద్యులు..
ఫార్మాలిటీ ప్రకారం పేపర్ వర్క్ పూర్తి చేయాలని చెప్పడంతో.. అన్ని వివరాలు రాసిచ్చానని మోహిత్ చెప్పాడు. అనంతరం మొదటి అంతస్తులో ఉన్న వార్డులోకి ఆమెను తీసుకెళ్లాలని వైద్యులు సూచించినట్టు పేర్కొన్నాడు. ఆ క్రమంలో తనకు ఎవరూ సాయపడలేదని.. తన తల్లి వద్దకు రావడానికి ఎవరూ సుముఖంగా లేరని అన్నాడు. దీంతో తానే తన తల్లిని పై అంతస్తుకు తీసుకెళ్లానని.. అక్కడికి వెళ్లాక గానీ అది ఐసోలేషన్ వార్డు అని తెలియలేదన్నాడు. తాను పైకి వెళ్తున్న క్రమంలో.. ఆ వార్డులో ఆక్సిజన్ సిలిండర్స్,నెబులైజర్స్ ఉన్నాయని కొంతమంది వైద్యులు చెప్పినట్టు పేర్కొన్నాడు. అంతేకాదు,వాటిని తానే ఉపయోగించాలని వారు చెప్పినట్టు తెలిపాడు.
Recommended Video
తన చేతుల్లోనే ప్రాణాలు వదిలిన తల్లి..
అయితే వాటిని ఎలా ఉపయోగించాలో తనకు తెలియలేదనీ.. ఎన్నిసార్లు కిందకు వెళ్లి వైద్యులు,వార్డు బాయ్స్కు విజ్ఞప్తి చేసినా.. ఎవరూ పైకి రాలేదని వాపోయాడు. దాదాపు మూడుసార్లు వైద్యుల వద్దకు పరిగెత్తికెళ్లి తన తల్లిని పరీక్షించాలని బతిమాలానని,కానీ ఎవరూ తన ఆవేదనను పట్టించుకోలేదని అన్నాడు. సమస్య తీవ్రం కావడంతో తన తల్లిని బతికించుకోవడానికి తానే సీపీఆర్ చేసినట్టు తెలిపాడు. అయితే తన తల్లిని కాపాడుకోలేకపోయానని... చివరకు తన చేతుల్లోనే ప్రాణాలు వదిలిందని కన్నీరుమున్నీరయ్యాడు. తనను ఆసుపత్రికి తీసుకురాకుండా ఉండాల్సిందని.. ఇంటి వద్దనే తాను చనిపోవాల్సిందంటూ.. తల్లి చివరగా మాట్లాడిన మాటలు గుర్తుచేసుకుంటూ బోరున విలపించాడు. వైద్యుల నిర్లక్ష్యాన్ని తన తల్లి బలైపోయిందని ఓ వీడియో ద్వారా బయటపెట్టడటంతో ఈ విషయం అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో జరిగిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చనిపోయిన మహిళకు కోవిడ్-19 ఉందా.. లేదా.. అన్నది ఆమె రిపోర్ట్స్ వస్తే గానీ తెలిసే అవకాశం లేదు.