గృహావసర ఎల్పీజీ సిలిండర్ల ధర భారీగా పెంపు: వారికి మాత్రమే ఊరట: ఆ కనెక్షన్ల ధర తగ్గింపు
న్యూఢిల్లీ: చమురు సంస్థలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లను పెంచాయి. ఒక్కో ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్పై 50 రూపాయల భారాన్ని మోపాయి. దీనితో పాటు అయిదు కేజీల సిలిండర్ల ధరలను కూడా సవరించాయి. ఒక్కో సిలిండర్ ధరలో 18 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. రూ.8.50 పైసల మేర తగ్గించాయి.
Recommended Video
తాజా పెరుగుదలతో వంటగ్యాస్ సిలిండర్ ధర వెయ్యి రూపాయలను దాటేసింది. దేశ రాజధానిలో రూ.1,053.50 పైసలకు చేరింది. కోల్కతలో రూ.1,079 రూపాయలు పలుకుతోంది. ముంబైలో రూ.1,052.50 పైసలు, చెన్నైలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1,068.50 పైసలుగా నమోదైంది. ఈ పెంపుదల అనేది 14.5 కేజీల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లకే పరిమితం కాలేదు. అయిదు కేజీల సిలండర్లపైనా భారం పడింది. ఒక్కో అయిదు కేజీల సిలిండర్ మీద ఏకంగా 18 రూపాయలను పెంచాయి చమురు కంపెనీలు.
వాణిజ్య అవసరాల కోసం ఎల్పీజీ సిలిండర్లను వినియోగించుకునే వారికి కొంత ఊరట ఇచ్చాయి. ఈ కేటగిరీ సిలిండర్ల ధరను స్వల్పంగా తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలో రూ.8.50 పైసలను తగ్గించినట్లు వెల్లడించాయి. అన్ని కేటగిరీలకు చెందిన ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లు ఏడాది కాలంగా పెరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలోనే రెండుసార్లు ధరల్లో సవరణలు చోటు చేసుకున్నాయి.
మే 7వ తేదీన 50, 19వ తేదీన నాలుగు రూపాయల మేర పెరుగుదల కనిపించింది. గత ఏడాది అక్టోబర్, ఫిబ్రవరి, మార్చిలోనూ పెంపుదల చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ 1వ తేదీన వాణిజ్య అవసరాల సిలిండర్ల ధర భారీగా తగ్గింది. 190 రూపాయల మేర తగ్గదల కనిపించింది. ఇప్పుడు మళ్లీ రూ.8.50 పైసలు తగ్గింది. కాగా దీపం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మంజూరు చేసే ఎల్పీజీ సిలిండర్ల మీద కేంద్ర ప్రభుత్వం 200 రూపాయల రాయితీని ప్రకటించిన విషయం తెలిసిందే.