ఇళ్లకు వాడే గ్యాస్ సిలండర్ ధర రూ.50పెంపు- అన్ని నగరాల్లో వెయ్యి దాటేసిన వైనం
జాతీయ చమురు మార్కెటింగ్ సంస్ధలు ఇవాళ ఇళ్లకు వాడే గ్యాస్ సిలెండర్ల ధరల్ని మరోసారి సవరించాయి. తాజా పెంపు ప్రకారం ప్రతీ గ్యాస్ సిలెండర్ పై రూ.50 మేర ధర పెరిగింది. ఈ మేరకు గృహవినియోగదారులు కొత్త ధర ప్రకారం చమురు సిలెండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
రెండు నెలల క్రితం ఓసారి గ్యాస్ సిలెండర్ల ధరల్ని సవరించిన కంపెనీలు ఇవాళ మరోసారి పెంపుకు సిద్ధపడ్డాయి. దీంతో రెండు నెలల్లో రెండోసారి చేసిన ధరల సవరణ కారణంగా చెన్నై, కోల్ కతాలో గ్యాస్ సిలిండర్ ధర ₹1,000 దాటిపోయింది. అదే సమయంలో ఢిల్లీ,ముంబైలో ₹999.50కి చేరుకుంది.
మార్చి 22న పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలతో హైదరాబాద్ వంటి నగరాల్లో ఇప్పటికే గ్యాస్ సిలెండర్ ధర వెయ్యిదాటిపోయింది.

పాల నుంచి వంట నూనెల వరకూ రోజువారీ వినియోగ వస్తువుల ధరలు పెరగడంతో పాటు పెట్రోలు, జిల్ ధరల కారణంగా ప్రయాణాలపై పెరిగిన వ్యయంతో గృహ బడ్జెట్లు ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న తరుణంలో గ్యాస్ ధరల పెంపు సాధారణ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చెన్నైలో
ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్ కొత్త ధర ₹1,015.50, కోల్కతాలో ₹1,026గా నమోదైంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ముడి చమురు ధరల పెరుగుదల మధ్య దేశీయ ఎల్పీజీ ధరలో పెరుగుదల గురించి వాణిజ్యవర్గాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. వాణిజ్య సిలెండర్లపై ఈ మధ్యే రూ.103 మేర పెంచిన చమురు సంస్ధలు ఇప్పుడు అందులో సగం గృహవినియోగదారులపైనా మోపాయి. దీంతో రాబోయే రోజుల్లో చమురు మంటలు దేశంలో కాక రేపేలా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications