కేంద్రాన్ని ఏమనొద్దు: మంత్రులకు పళని, పన్నీరుకు చెక్ పెట్టేందుకా?
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్రంతో సన్నిహితంగా ఉండాలని భావిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆయన తన మంత్రులకు ఓ ఆదేశం జారీ చేశారని తెలుస్తోంది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కేంద్రంతో సన్నిహితంగా ఉండాలని భావిస్తున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ఆయన తన మంత్రులకు ఓ ఆదేశం జారీ చేశారని తెలుస్తోంది.
బహిరంగంగా కేంద్రంపై ఎలాంటి విమర్శలు చేయవద్దని పళనిస్వామి మంత్రులకు హితవు పలికారని తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారని సమాచారం.
కరువు, తాగు నీటి కష్టాలు, కావేరీ అంసం, నీట్... తదితర అంశాలపై మంగళవారం నాడు కేబినెట్ సమావేశం జరిగింది. అలాగే, పన్నీరుసెల్వం వర్గంతో కలయిక అంశంపై కూడా చర్చ జరిగిందని తెలుస్తోంది.
మోడీ ప్రభుత్వాన్ని విమర్శించవద్దు
ఈ సమయంలో ముఖ్యంగా.. కేంద్రాన్ని బహిరంగంగా విమర్శించవద్దని పళనిస్వామి ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఫిషర్ మెన్, నీట్, కరువు తదితర అంశాలపై కేంద్రంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారని తెలుస్తోంది.
ఏ అంశం పైన కూడా..
కరువు, రుణమాఫీ అంశాలపై కేంద్రం నుంచి స్పందన కావాలని తమిళనాడు సోమవారం డిమాండ్ చేసింది. ఈ సమయంలో పళనిస్వామి.. కేంద్రాన్ని విమర్శించవద్దని సూచనలు చేయడం గమనార్హం.
ప్రధానికి పళని లేఖ
కేబినెట్ భేటీ అనంతరం పళనిస్వామి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. శ్రీలంక నావీ అదుపులోకి తీసుకున్న అయిదుగురు ఫిషర్ మెన్లను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
వ్యూహాత్మకమా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. అన్నాడీఎంకేలోని పన్నీరుసెల్వం వర్గంకు అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని తమకు అనుకూలంగా మార్చుకునే ఉద్దేశ్యంలో భాగంగా పళనిస్వామి పావులు కదుపుతున్నారా? లేక కష్టాల నుంచి గట్టెక్కేందుకు చిన్నమ్మ శశికళ సూచనల మేరకు ముందుకు వెళ్తున్నారా అనే చర్చ సాగుతోంది.