జయలలితకు పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దు: శశికళ
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం సృష్టించడానికి కొందరు కుట్రపన్నుతున్నారని, వాటిని మనం తిప్పికొట్టాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ అన్నారు. పార్టీని రచ్చకు ఈడ్చాటానికి ప్రయత్నిస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆమె పరోక్షంగా పార్టీలోని రెబల్ లీడర్స్ ను హెచ్చరించారు.
అన్నాడీఎంకే పార్టీని ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) స్థాపించారని ఇదే సమయంలో ఆమె గుర్తు చేశారు. అయితే అన్నాడీఎంకే పార్టీని జయలలిత ముందుకు నడిపించారని, ఆమె లేని లోటును పార్టీలో ఎవ్వరూ తీర్చలేరని శశికళ చెప్పారు.
తమిళనాడులో విప్లవ నాయకురాలిగా అమ్మ జయలలిత గుర్తింపు తెచ్చుకున్నారని, అమ్మ పేరును కాపాడి పార్టీని ముందుకు నడిపించి కోట్లాది మంది కార్యకర్తలను మనం కాపాడుకోవడానికి శక్తి వంచన లేకుండా పని చెయ్యాలని నాయకులకు పిలుపునిచ్చారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో తనకు 33 ఏళ్ల స్నేహం ఉందని శశికళ గుర్తు చేశారు. జయలలిత ఎప్పుడు పార్టీలో కులాలు, మతాలు అనే ప్రస్థావన తీసుకురాలేదని, ఇప్పుడు మనం అదే పద్దతిపాటించాలని నాయకులకు సూచించారు.
మనలోనే ఉంటూ శత్రువులుగా తయారై ఇప్పుడు అన్నాడీఎంకే పార్టీ కంచుకోటను బద్దలు చెయ్యాలని చూస్తున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని శశికళ పరోక్షంగా తనను విమర్శిస్తున్న నాయకులను హెచ్చరించారు.
తనను విమర్శిస్తున్న నాయకుల పేర్లు చెప్పకుండానే ఇష్టం లేకపోతే వారు రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని పరోక్షంగా హెచ్చరించారు. జయలలితను ఆదర్శంగా తీసుకుని తాను ప్రజాసేవ చేస్తానని శశికళ పార్టీ నాయకులకు చెప్పారు. అంతే కాని పార్టీకి, జయలలితకు చెడ్డపేరు తీసుకురాకూడదని శశికళ హితవుపలికారు.












Click it and Unblock the Notifications