అమానవీయం: కారుకు రక్తపు మరకలంటుతాయని.. ఇద్దరు యువకుల ప్రాణం తీసిన పోలీసులు
సహరాన్పూర్: మానవత్వం లేని ఓ పోలీసు అధికారి కారణంగా ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కొట్టుమిట్టాడుతున్న యువకుల ప్రాణాలు కాపాడాల్సిన ఆ బాధ్యతల గల పోలీసు అధికారి.. పెట్రోలింగ్ కారుకు రక్తపు మరకలు అంటుతాయని వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఒప్పుకోలేదు.
తమను కాపాడాలంటూ గాయపడిన వారిలో ఒకరు వేడుకున్నప్పటికీ ఆ పోలీసు అధికారి, మరో ముగ్గురు పోలీసులు స్పందించకపోవడం విచారకరం. దీంతో సరైన సమయంలో చికిత్స అందక ఆ యువకులు మృతి చెందారు. ఈ అమానవీయ ఘటన గురువారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరాన్పూర్లో చోటు చేసుకుంది.
కాపాడాలంటూ వేడుకున్నా..
ఘటనా స్థలంలో వేరే వాహనం కూడా లేదని, దయచేసి గాయపడిన యువకులను ఆస్పత్రికి తరలించాలంటూ అక్కడున్న కొందరు కూడా పోలీసులను వేడుకున్నారు. అయినా కూడా స్పందించని పోలీసులు.. అక్కడే నిల్చున్నారే గానీ.. వారికి ఎలాంటి సాయమూ అందించలేదు. తమ పెట్రోలింగ్ కారుకు రక్తపు మరకలు అంటుతాయంటూ వారిని ఆస్పత్రికి తరలించకపోవడం గమనార్హం.
ఆలస్యం కావడంతో యువకులు మృతి
అంతేగాక, రక్తపు మరకలతో కారు ఉంటే తాము ఎక్కడ కూర్చోవాలంటూ పోలీసులే వారిని ఎదురు ప్రశ్నించడం శోచనీయం. కాగా, కొంత సేపటి తర్వాత వచ్చిన స్థానిక పోలీసులు.. గాయపడిన ఇద్దరు యువకులను తమ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ యువకులు మృతి చెందారని వైద్యులు తెలిపారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
కాగా, ఈ ఘటనపై సహరాన్పూర్ డీఐజీ సునీల్ ఎమాన్యూల్ తీవ్రంగా స్పందించారు. అమానవీయంగా వ్యవహరించిన సదరు ముగ్గురు పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే వారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విచారణ జరిపి వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
వీడియో వైరల్
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో సదరు పోలీసులపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.