ఇంటింటికీ వ్యాక్సినేషన్ సాధ్యపడదు... ఎందుకంటే... వ్యాక్సిన్ డ్రైవ్పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు...
దేశవ్యాప్తంగా ఇంటింటికీ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ పాలసీని రద్దు చేయమని కేంద్రానికి తాము ఆదేశాలివ్వలేమని తెలిపింది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ డ్రైవ్ బాగానే జరుగుతోందని వ్యాఖ్యానించింది. యూత్ బార్ అసోసియేషన్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన సుప్రీం బెంచ్ బుధవారం(సెప్టెంబర్ 8) విచారణ చేపట్టింది.
దివ్యాంగులు, వెనకబడిన వర్గాలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు వీలుగా... ఇంటింటికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని యూత్ బార్ అసోసియేషన్ తమ పిటిషన్లో పేర్కొంది. అయితే సుప్రీం కోర్టు ఆ వాదనతో ఏకీభవించలేదు.'దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఉన్న విభిన్న పరిస్థితులు,పాలనా పరమైన సంక్లిష్టతల కారణంగా దేశవ్యాప్తంగా ఇంటింటికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ సాధ్య పడదు. కేరళతో పోల్చితే లదాఖ్లో ఉన్న పరిస్థితులు. మరో రాష్ట్రంతో పోల్చితే ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితులు వేరు. పట్టణ ప్రాంతాలకు,గ్రామీణ ప్రాంత పరిస్థితులకు తేడా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు,సమస్యలు ఉన్నాయి.' అని సుప్రీం కోర్టు పేర్కొంది.
కోవిడ్ మృతుల కేసులను మెడికల్ నిర్లక్ష్యంగా భావించి ప్రతీ బాధిత కుటుంబానికి పరిహారం అందేలా చూడాలన్న పిల్ను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. కోవిడ్ కారణంగా సంభవించిన మరణాలన్నింటినీ మెడికల్ నిర్లక్ష్యంగా చూడలేమని పేర్కొంది. దీనిపై పిటిషనర్ కేంద్రాన్ని ఆశ్రయించాలని సూచించింది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 71 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీరిలో 50,42,806 మందికి మొదటి డోసు ఇవ్వగా,23,37,704 మందికి రెండో డోసు పూర్తయింది. మంగళవారం(సెప్టెంబర్ 7) 73 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 30 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ నుంచి 40 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి చేరుకోవడానికి 24 రోజులు పట్టింది. 50 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీకి మరో 20 రోజులు పట్టింది. ఆ తర్వాత 60 కోట్ల డోసులకు మరో 19 రోజులు 70 కోట్ల డోసులకు 13 రోజులు పట్టింది.
ఇప్పటివరకూ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవారిలో 18-44 ఏళ్ల వయసు వారు 28,57,04,140 మంది, ఇదే ఏజ్ గ్రూపులో రెండో డోసు తీసుకున్నవారు 3,85,99,523 మంది ఉన్నారు.ఈ ఏడాది జనవరి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ఆ తర్వాత 60 ఏళ్ల వయసువారికి,ఆ తర్వాత 45 ఏళ్లు పైబడినవారికి,క్రమంగా 21 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
Recommended Video
దేశవ్యాప్తంగా కొత్తగా 37,875 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 369 మంది మరణించారు. గత 24 గంటల్లో మరో 39,114 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718కు చేరింది. ఇందులో 3,22,64,051 మంది వైరస్ నుంచి కోలుకోగా, ప్రస్తుతం 3,91,256 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ కోవిడ్తో 4,41,411 మంది బాధితులు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 25,772 కేసులు ఉన్నాయని, 189 మంది మరణించారని తెలిపింది.