డ్రోన్లు రోడ్లపై తయారు కాలేదు .. పాక్ సహకారంతోనే డ్రోన్ల దాడి : జనరల్ పాండే
పాక్ సహకారంతోనే డ్రోన్లతో దాడికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఉగ్రవాదులకు అందిందని చినార్ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డిపి పాండే అభిప్రాయపడ్డారు. డ్రోన్లతో జరుగుతున్న దాడి యత్నాలలో పాకిస్థాన్ ప్రేరేపిత జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే తోయిబా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. పాక్ సైన్యానికి డ్రోన్ లను ఉపయోగించడం బాగా తెలుసని డ్రోన్ యుద్ధం వంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వార్ పాక్ మద్దతు వ్యవస్థలతోనే జరుగుతుందని జనరల్ పాండే చెప్పారు.
భవిష్యత్ లోనూ బెదిరింపులకు ఛాన్స్
ముందు ముందు కూడా అలాంటి బెదిరింపులు కొనసాగవచ్చునని,మరింత పెరిగే అవకాశం లేకపోలేదని జనరల్ పాండే వెల్లడించారు. ఏదేమైనా, భారత సాయుధ దళాలు ఇటువంటి బెదిరింపులను ఎదుర్కొంటాయని పేర్కొన్న ఆయన జాతీయ భద్రతకు, తాజాగా ఎదురవుతున్న అన్ని సవాళ్లను పరిష్కరించడానికి క్రియాశీల పరిష్కారాలను అన్వేషిస్తున్నాయని భద్రతా దళాలు ఆయన నొక్కి చెప్పారు. డ్రోన్ల దాడి సాంకేతికతను గుర్తించే విధంగా యాంటీ డ్రోన్ టెక్నాలజీని కూడా అన్వేషిస్తున్నాయి.
డ్రోన్లతో యుద్ధతంత్రం పాకిస్తాన్ దే
టెక్నాలజీతో డ్రోన్ యుద్ధం కేవలం రోడ్డు పక్కన ఉన్నవాళ్లు చేసే పని కాదని మాకు బాగా తెలుసునని, పాకిస్తాన్ పూర్తిగా సహాయసహకారాలు వీటికి అందిస్తుందని ఆరోపించారు. డ్రోన్ల తో యుద్ధ తంత్రం పాకిస్తాన్ కు బాగా తెలుసన్నారు .ఇవి పాక్ ప్రేరేపిత డ్రోన్ సాంకేతికతను సూచిస్తాయని జనరల్ పాండే వెల్లడించారు. కొనసాగుతున్న దర్యాప్తు వివరాలను వెల్లడించడం వల్ల దర్యాప్తుకు ఆటంకం ఏర్పడుతుందని పేర్కొన్న ఆయన డేటా ప్రాధమిక విశ్లేషణ పాక్ ప్రభుత్వం నుండి కొంత సహాయ సహకారాలను సూచిస్తుందని వెల్లడించారు.
గత రెండేళ్లుగా ఉగ్రవాదులకు ఆయుధాలు అందించేందుకు డ్రోన్ సాంకేతికత
గత రెండు సంవత్సరాలుగా పాకిస్తాన్ డ్రోన్లను సరిహద్దు మీదుగా ఆయుధాలు చేరవేయడానికి ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. 2019 ఆగస్టులో పంజాబ్లో అమృత్సర్లోని ఒక గ్రామంలో కూలిపోయిన డ్రోన్ దొరికింది. మరుసటి నెలలో, భద్రతా దళాలు అరెస్టు చేసిన ఉగ్రవాదులు ఎనిమిది వేర్వేరు డ్రోన్ విమానాలపై రాష్ట్రంలో డ్రగ్స్ మరియు ఆయుధాలను అక్రమ రవాణా చేస్తున్నారని వెల్లడించారు.గత ఏడాది జూన్లో, జమ్మూలోని కతువా జిల్లాలో బిఎస్ఎఫ్ అనుమానిత డ్రోన్ను కాల్చివేసింది.
Recommended Video
ఉగ్రమూకలను వెనక ఉండి నడిపిస్తుంది పాకిస్తాన్
ఉగ్రవాదులు చేస్తున్న దాడుల వెనుక ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసని, డ్రోన్ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కడినుండి అందుతున్నాయో కూడా తెలుసని జనరల్ పాండే వెల్లడించారు. పాకిస్తాన్ వెనుక ఉండి ఉగ్ర మూకలను ముందుకు నడిపిస్తుందని జనరల్ పాండే తేల్చిచెప్పారు.ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం ఎన్ఐఏని రంగంలోకి దింపి దర్యాప్తు చేస్తుంది .