'ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు వెనుక బీజేపీ-ఆర్ఎస్ఎస్ కుట్ర!'
ప్రాసిక్యూషన్ ఎటువంటి ఆధారాలు చూపకపోయినా కోర్టు శిక్ష విధించడం పట్ల సాయిబాబా భార్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముంబై: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా సహా ఆరుగురికి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. సాయిబాబా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న కారణంగా ఆయనకు కోర్టు ఈ శిక్ష విధించింది.
గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సాయిబాబా భార్య వసంత కుమారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్జీషీటులో ఉన్న నిందితులందరికీ శిక్ష విధించడం మహారాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని అన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ కుట్ర కారణంగానే సాయిబాబాకు ఈ శిక్ష విధించారని ఆమె ఆరోపించారు.
ఆర్ఎస్ఎస్ ఎజెండాను నిస్సిగ్గుగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని సాయిబాబా భార్య ఆరోపించారు. అప్రజాస్వామిక విధానాలు, ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపుతోందని ఫస్ట్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసంతకుమారి చెప్పారు.
ప్రాసిక్యూషన్ ఎటువంటి ఆధారాలు చూపకపోయినా కోర్టు శిక్ష విధించడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెషన్స్ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. కాగా, సాయిబాబాతో పాటు మహేష్ తిక్రి, పాండు నరోటీ, విజయ్ టిక్రి, జేఎన్ యూ విద్యార్థులు హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహితో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.