ఫేస్బుక్ ప్రియుడు దూరం: అమ్మాయి ఆత్మహత్య
ఫేస్బుక్లో పరిచయమైన తన ప్రియుడు తనను దూరం ఉంచుతున్నాడని మనస్తాపం చెందిన ఓ 14ఏళ్ల బాలిక మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 9వ తరగతి చదువున్న బాధిత బాలిక యెలహంకలోని శేషాద్రిపురం కళాశాలలో బికాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎం మనోజ్ కుమార్ నుంచి వచ్చిన ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్కు అంగీకారం తెలిపింది.
దీంతో వీరిద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఎన్నో మాయమాటలు చెప్పిన మనోజ్ ఆ బాలికను ప్రేమించినట్లు నటించాడు. బాలిక తరచూ ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్లి మనోజ్తో చాటింగ్ చేస్తూ ఉండేది. ఒక రోజు మనోజ్ నందినీ లే అవుట్లోని తన బ్యాచిలర్ గదికి పిలవడంతో ఆమె వెళ్లింది. మనోజ్ బాలికతో శారీరక సంబంధం ఏర్పరచుకునేందుకు ఆమె ఒత్తిడి చేశాడు. అంతేగాక తన స్నేహితుల వివరాలు, మొబైల్ ఫోన్ నెంబర్లు, ఫేస్బుక్ ఖాతాలను తెలపాలని బాలికను కోరాడు.
దీంతో బాలిక అతనిపై అనుమానం వ్యక్తం చేసింది. తనను వివాహం చేసుకోవాలని బాలిక కోరడంతో.. అలాంటి ఆలోచన లేదని మనోజ్ చెప్పడంతో ఆమె షాక్కు గురైంది. ఇదంతా తన సరదా కోసం చేశానని, గతమంతా మరిచిపోవాలని ఆమెకు చెప్పాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన బాలిక తన నివాసానికి చేరుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుంది.
తమ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చిన బాలిక తల్లిదండ్రులు ఆమె ఉరివేసుకుని నిర్జీవంగా ఉండడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్న తనను మనోజ్ మోసం చేశాడని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తను ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక తన సూసైడ్ నోట్లో పేర్కొంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బుధవారం నిందితుడు మనోజ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు పోలీసులు చేసినట్లు తెలిపారు.