ఎవరీ దుష్యంత్ చౌతాలా..కింగ్ పిన్: సీఎం పదవి ఇచ్చిన వారికే మద్దతు: కాలిఫోర్నియా వర్శిటీ స్టూడెంట్ గా!
చండీగఢ్: హర్యానా ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా యావత్ దేశ దృష్టిని ఆకర్షించాయి. హర్యానాలో భారతీయ జనతాపార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకుంటుందంటూ రాజకీయ పండితులు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. ఓటర్ల నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ సైతం విఫలం అయ్యాయి. హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అధికారాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను ఏ పార్టీ కూడా అందుకోలేకపోయింది. భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్డీ) పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని అందుకోలేక చతికిల పడ్డాయి.
కింగ్ మేకర్ జన్ నాయక్ జనతాపార్టీ..
ఇలాంటి పరిస్థితుల్లో కింగ్ మేకర్ లా మారింది.. జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ). అంచనాలకు మించి రాణించింది. బీజేపీ, కాంగ్రెస్ వంటి హేమాహేమీలను తట్టుకుని నిలబడగలిగింది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే విషయాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న జేజేపీ.. ఏ పార్టీకి మద్దతు ఇస్తే.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. దీనితో- అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్.. జన్ నాయక్ జనతాపార్టీ అధినేత దుష్యంత్ చౌతాలాను మెప్పించడానికి తమ వంతు ప్రయత్నాలు ఆరంభించాయి. ముఖ్యమంత్రి పదవి తప్ప ఏదడిగినా ఇస్తామని హామీ ఇస్తున్నాయి.
ఎవరీ దుష్యంత్ చౌతాలా..కాలిఫోర్నియా వర్శిటీ స్టూడెంట్
దుష్యంత్ సింగ్.. మాజీ ఉప ప్రధాన మంత్రి చౌదరి దేవీలాల్ మునిమనవడు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు. ఇదివరకు దుష్యంత్ చౌతాలా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ లో కొనసాగారు. అనంతరం ఆ పార్టీ నుంచి బయటికి వచ్చారు. సొంతంగా జన్ నాయక్ జనతాపార్టీని స్థాపించారు. ఏడాది కిందటే ఆయన ఈ పార్టీని నెలకొల్పారు. తన తాత దేవీలాల్ కు ఉన్న పేరు ప్రతిష్ఠలను నిచ్చెనగా మార్చుకున్నారు. హర్యానా రాజకీయాల్లో ఓ కెరటంలా దూసుకొచ్చారు. పార్టీ ఏర్పాటు చేసిన అనంతరం ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదగడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఎవరు ముఖ్యమంత్రి పదవి ఇస్తే వారికే మద్దతు..
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన నేపథ్యంలో.. జన్ నాయక్ జనతా పార్టీ మద్దతు లేనిదే ఏ పార్టీ కూడా అధికారాన్ని అందుకోలేదు. దీనితో దుష్యంత్ చౌతాలా ఏకంగా ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. తమ పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని హామీ ఇచ్చే పార్టీకే తాను మద్దతు ఇస్తామని దుష్యంత్ చౌతాలా తేల్చి చెప్పారు. కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ.. జేజేపీ మద్దతు లేనిదే అధికారాన్ని అందుకోలేని ప్రస్తుత పరిస్థితుల్లో దుష్యంత్ చౌతాలా డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురైంది. దుష్యంత్ చౌతాలా చెప్పిన డిమాండ్లకు బీజేపీ గానీ, కాంగ్రెస్ గానీ అంగీకరిస్తే.. ఆయన ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడం ఖాయంగా కనిపిస్తోంది.