30 ఏళ్ల తర్వాత ఇలా అవమానం: స్టాలిన్ క్షమాపణ.., అదే జరిగితే...
తమిళనాడు అసెంబ్లీలో 30 ఏళ్లనాటి చరిత్ర పునరావృతమైందా? అంటే అవుననే అంటున్నారు. డీఎంకే సభ్యులు నాడు జయలలిత చీరను లాగారు. 1989లో విపక్ష అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఇదే తీరులో దాడి జరిగింది.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో 30 ఏళ్లనాటి చరిత్ర పునరావృతమైందా? అంటే అవుననే అంటున్నారు. డీఎంకే సభ్యులు నాడు జయలలిత చీరను లాగారు. 1989లో విపక్ష అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై ఇదే తీరులో దాడి జరిగింది.
అప్పట్లో ఆమె చీరను డీఎంకే సభ్యులు లాగినట్టు వార్తలు వచ్చాయి. సభ బయటకు వచ్చిన జయ సీఎంగానే సభలో అడుగుపెడుతానని శపథం చేసి వెళ్లిపోవడం గమనార్హం. అయితే జయపై దాడి చేయలేదని తొక్కిసలాట జరిగిందని డీఎంకే పేర్కొంది.
ఆ ఘటనలో జయలలితపై తమిళనాట సానుభూతి వెల్లువగా మారింది. 1991లో ఎన్నికల పర్యటనలో వున్న రాజీవ్ గాంధీపై ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యురాలు దాడి చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-అన్నాడీఎంకే కూటమి ఘన విజయం సాధించడంతో జయలలిత సీఎంగా పగ్గాలు చేపట్టారు.
ఇప్పుడు కూడా విపక్ష నేత స్టాలిన్కు గౌరవం దక్కలేదని అంటున్నారు. అసెంబ్లీ పరిణామాలపై గవర్నర్ అనూహ్య నిర్ణయం తీసుకుంటే.. అనే చర్చ సాగుతోంది.

గొడవతో.. నాడు జానకి సర్కారు రద్దు
నాడు అంతకుమందు, ఎంజీఆర్ చనిపోయినప్పుడు నాడు జానకి, జయలలితల మధ్య ఆధిపత్య పోరాటం జరిగింది. ఇరువర్గాలు తమ మద్దతుదారులతో శిబిరాలు నిర్వహించారు. జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఖురానా ఆహ్వానించారు.
విశ్వాస పరీక్ష సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఓటింగ్ చెల్లదని జానకి సర్కారును గవర్నర్ రద్దు చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకె గెలుపొందింది.
మొత్తానికి ఎంజీ రామచంద్రన్ చనిపోయిన తర్వాత జయలలిత - జానకీరామచంద్రన్ మధ్య పోరు జరిగింది. ఇప్పుడు జయ మృతి తర్వాత శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం అయింది. నాడు జయకు సభలో అవమానం ఆ తర్వాత కొన్నేళ్లకు జరిగింది.

నేడు ఆధిపత్య పోరు, పన్నీరుకు డీఎంకే మద్దతు
ఇప్పుడు మాత్రం ఆధిపత్య పోరు జరుగుతుండగానే అసెంబ్లీ రణరంగం అయింది. స్పీకర్ చొక్కా, ప్రతిపక్ష నేత స్టాలిన్ చొక్కా చిరిగింది. అయితే, ఇక్కడ అన్నాడీఎంకేలోని పన్నీరు వర్గానికి ప్రతిపక్షం మద్దతు పలకడం గమనార్హం.

అసెంబ్లీ రణరంగం
ఇప్పుడు, అసెంబ్లీ మరోసారి ఉద్రిక్తంగా మారింది. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకే, చీలిక వర్గ అన్నాడీఎంకే, విపక్ష డీఎంకే సభ్యుల సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగింది.

పన్నీరు పట్టు
మాజీ సీఎం పన్నీర్ సెల్వం రహస్య ఓటింగ్కు పట్టుబట్టగా డీఎంకే సభ్యులు ఆయనకు మద్దతు పలికారు. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే స్పీకర్ ధనపాల్ వీరి డిమాండ్లను తోసివేసి డివిజన్ వారీగా ఓటింగ్ నిర్వహించడంతో సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.

గవర్నర్కు ఫిర్యాదు
అనంతరం స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర రావును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మెరీనా బీచ్ వద్ద దీక్షకు దిగగా, పోలీసులు భగ్నం చేశారు. ఈ ప్రభుత్వం కూలుతుందని పన్నీరు సెల్వం కూడా వ్యాఖ్యానించారు. సభలో జరిగిన తీరును అందరూ తప్పుబడుతున్నారు. ఇటు పళనిస్వామి, అటు డీఎంకే తీరును తప్పుబడుతున్నారు. పళనిస్వామి నెగ్గినందున ఇప్పుడు గవర్నర్ ఏమైనా చేస్తారా అనే ఆసక్తి నెలకొంది.

చిరిగిన స్టాలిన్ చొక్కా
సభ ప్రారంభమైన వెంటనే విశ్వాసపరీక్షకు ఇంకా సమయముందని మరో రోజున నిర్వహించాలని ప్రతిపక్షనేత స్టాలిన్ కోరారు అయితే స్పీకర్ ఆ వినతిని తోసిపుచ్చారు. విశ్వాసపరీక్షను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దీనిపై విపక్షం ఆందోళన వెలిబుచ్చడంతో సభన వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.

స్పీకర్ చొక్కా చిరిగింది.. స్టాలిన్ క్షమాపణ
అనంతరం కొద్ది సేపటికే సభ తిరిగి ప్రారంభమయింది. విపక్ష సభ్యులు ఆందోళనకు దిగి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఒక దశలో డీఎంకే సభ్యులు స్పీకర్ చొక్కాను లాగారు. స్పీకర్ స్థానంలో వున్న మైక్రోఫోన్ను తీసి వేయడంతో పాటు వాయిదా వేసి వెళుతున్న స్పీకర్ను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ తిరిగి సభను వాయిదా వేశారు. తన చొక్కా చినిగిపోయిందని ఎవరికి చెప్పుకోవాలని స్పీకర్ ధన్పాల్ అన్నారు. అనంతరం తిరిగి ప్రారంభమయిన సభలో స్పీకర్పై విపక్ష సభ్యుల ప్రవర్తనకు స్టాలిన్ క్షమాపణలు తెలిపారు.

సభ్యుల సస్పెన్షన్
సభను వాయిదా వేయాలని లేదా సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహించాలని స్టాలిన్ కోరారు. స్పీకర్ దానికి అంగీకరించకపోవడంతో డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. డీఎంకే సభ్యులను సభనుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. డీఎంకే సభ్యులను బయటకు తీసుకువెళ్లేందుకు మార్షల్స్ యత్నించడంతో పెనుగులాట జరిగింది. ఈ ఘటనలో విపక్షనేత స్టాలిన్ చొక్కా చినిగిపోయింది. సభ బయటకు వచ్చిన స్టాలిన్ తన చిరిగిన చొక్కాను చూపిస్తూ అధికార సభ్యులు తనపై దౌర్జన్యం చేశారన్నారు.

నాడు.. నేడు
పైన పేర్కొన్న రెండు సందర్భల్లోనూ విపక్షనేతకు సభలో ఎలాంటి గౌరవం దక్కలేదని తెలుస్తోంది. సభలో విపక్షనేతకు క్యాబినెట్ హోదా ఉంటుంది. అయితే ఆ హోదాను కూడా గౌరవించకుండా అధికార సభ్యులు అనుచితంగా ప్రవర్తించడంపై ప్రజాస్వామ్యవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications