ట్రాఫిక్ సమస్య, ఐటి విస్తరించాలి: కలాం
బెంగళూరు: భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏ.పి.జే. అబ్దుల్ కలాం భారతదేశంలోని అన్ని నగరాలలో ఐటి, బీటి సంస్థలు ఏర్పాటు చెయ్యాలని ఆశపడ్డారు. ప్రస్తుతం ఐటి కంపెనీలకు బెంగళూరు ప్రసిద్ది చెందిందని అయితే ఆ కీర్తి దేశంలోని అన్ని నగరాలకు విస్తరించాలని ఆయన అనేక సార్లు చెప్పారు.
అబ్దుల్ కలాం బెంగళూరులోని యలహంకలో ఉన్న తన అపార్ట్ మెంట్ లో నివాసం ఉండేవారు. బెంగళూరులో డీఆర్ డీఒ, ఇస్రో, హెచ్ఏఎల్ లో పని చేసే సమయంలో అబ్దుల్ కలాం యలహంకలోని తన అపార్ట్ మెంట్ నుండి రోజు విధులకు వెళ్లేవారు.
ఆ సందర్బంలో బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ సమస్యను అబ్దుల్ కలాం స్వయంగా చూశారు. రాష్ట్రపతి అయిన తరువాత కలాం అనేకసార్లు బెంగళూరు వచ్చారు. ఆ సందర్బంలో బెంగళూరు నగరంలో పచ్చదనాన్ని కాపాడుకుంటూనే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
మెట్రో రైలు సంచారంతో బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కొంతమేరకైనా తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండ ఐటి, బీటి సంస్థలు అన్ని నగరాలకు విస్తరించాలని సూచించారు. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయిన తరువాత కూడ యలహంకలోని తన అపార్ట్ మెంట్ ను సందర్శించిన రోజులు ఉన్నాయి.
అబ్దుల్ కలాం మరణించారని తెలుసుకున్న యలహంకలోని అపార్ట్ మెంట్ వాసులు అబ్దుల్ కలాంతో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అబ్దుల్ కలాంకు ఘనంగా నివాళులు అర్పించారు. ఎంతో కాలం ఇదే అపార్ట్ మెంట్ లో మాతో కలిసి అబ్దుల్ కలాం నివాసం ఉన్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు.