కరోనా విలయం: ఈసీ అనూహ్యం -బెంగాల్ షెడ్యూల్ కుదింపు? -ఒకే ఫేజ్లో పోలింగ్? -అఖిలపక్ష భేటీకి పిలుపు
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరడం, ఎన్నికల రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ లోనూ కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండటంతో ఎన్నికల సంఘం కీలక చర్యలకు ఉపక్రమించింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల షెడ్యూల్ ను కుదించి, మిగిలిన నాలుగు విడతల పోలింగ్ ను ఒకే దఫాలో నిర్వహించే దిశగా ఈసీ అడుగులు వేస్తున్నది..
షాకింగ్: మోదీ ప్రచారంపై నిషేధం కోరుతూ టీఎంసీ లేఖ -ఈసీపై సంచలన ఆరోపణలు -బీజేపీకి అనుకూలమంటూ
అఖిలపక్షానికి ఈసీ పిలుపు
పశ్చిమ బెంగాల్ లో ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా కొనసాగుతోన్న దరిమిలా తదుపరి విడతల్లో ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకుగానూ అఖిలపక్ష భేటీకి ఈసీ పిలుపునిచ్చింది. ఈనెల 16న (శుక్రవారం) ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ బుధవారం ఒక ప్రకటన చేసింది. తదుపరి విడతల్లో ప్రచారం, పోలింగ్ సరళిపై చర్చించడమే ఆల్ పార్టీ మీటింగ్ అజెండగా ప్రకటనలో పేర్కొంది. కాగా,
షెడ్యూల్ కుదింపు.. ఒకేసారి పోలింగ్..
కరోనా కేసుల పెరుగుదల దృష్ట్యా ఎన్నికల నిర్వహణపై ఈసీ అఖిలపక్ష సమావేశానికి పిలుపు ఇవ్వడంతో షెడ్యూల్ ను కుదించబోతున్నారనే వాదన తెరపైకి వచ్చింది. మొత్తం 294 స్థానాలకు గానూ ఎనిమిది దశల్లో ఈసీ షెడ్యూల్ ప్రకటించగా, ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఈనెల 17న(శనివారం) ఐదో దశ పోలింగ్ జరుగనుంది. కాగా, కరోనా తీవ్రత కారణంగా ఆ తర్వాత జరగాల్సిన మూడు ఫేజ్ లను కుదించి, ఆయా స్థానాల్లో ఒకే సారి పోలింగ్ నిర్వహించే దిశగా ఈసీ ప్రయత్నిస్తోందని, ఆల్ పార్టీ మీటింగ్ లో పార్టీలను ఒప్పించిన తర్వాత ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
ఇప్పటికి 135 స్థానాల్లో పూర్తి..
బెంగాల్ లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, తొలి దశలో 30 స్థానాలకు, రెండో దశలో 30, మూడో దశలో 31, నాలుగో దశలో 44 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఈనెల 17న ఐదో దశలో 45 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. దాంతో మొత్తం 180 సీట్లకు ఎన్నికలు పూర్తయినట్లవుతుంది. మిగిలిన మూడు దశల్లో(6, 7, 8వ దశలు కలిపి) 114 స్థానాలు మిగులుతాయి. షెడ్యూల్ ను కుదించి, ఆ మూడు దశలకు ఓకే ఫేజ్ లో పోలింగ్ నిర్వహిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఐదో దశను కూడా కలిపేసి, మొత్తం నాలుగు దశలకూ ఒకే సారి పోలింగ్ నిర్వహించే అవకాశాలూ లేకపోలేవనీ ప్రచారం జరుగున్నప్పటికీ, చివరి మూడు దశల్ని ఒకటిగా మార్చే అవకాశాలే ఎక్కువ.
బెంగాల్లో కొవిడ్ విలయం
ఎన్నికల ప్రచారంతోపాటే బెంగాల్ లో కరోనా వైరస్ వ్యాప్తి సైతం ఉధృతంగా సాగుతున్నది. బెంగాల్ ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,817 కేసులు, 20 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,24,224కు, మొత్తం మరణాల సంఖ్య 10,434కు పెరిగింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 29,050గా ఉంది. బుధవారం నమోదైన కొత్త కేసులు బెంగాల్ కరోనా రికార్డుల్లో అత్యధికం కావడం గమనార్హం. కేసుల ఉధృతి నేపథ్యంలోనే ఎన్నికల షెడ్యూల్ ను కుదించి, మిగిలిన ఫేజ్ లను ఒకటిగా చేసి పోలింగ్ నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ కుదింపునకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్ -ప్రధాని అయ్యే అవకాశమింతే -అంబేద్కర్ సనాతన హిందువేనంటూ