ఈసీ సంచలనం: నందిగ్రామ్లో 144 సెక్షన్ -హెలికాప్టర్లతో నిఘా -స్థానికేతరులకు నో ఎంట్రీ -దీదీvsఅధికారి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పోలింగ్ రోజున వర్తించే నిషేధాజ్ఞలకు అదనంగా పకడ్బందీ నిఘా, భద్రతకు ఉపక్రమించింది. పశ్చిమ బెంగాల్లో గురువారం రెండో దశ పోలింగ్ జరుగనుండగా, సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి తలపడుతోన్న నందిగ్రామ్ లో సెక్షన్ 144 విధిస్తున్నట్లు అధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

అందుకే 144 సెక్షన్..
రెండో దశ పోలింగ్ లో భాగంగా బెంగాల్ లోని 30 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల్లో ఉత్కంఠ పోరుకు తెరలేపిన నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి కూడా రేపే పోలింగ్ జరగనుంది. అయితే ఈ సమస్యాత్మక ప్రాంతంలో అల్లర్లు చెలరేగే ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అక్కడ నిషేధాజ్ఞలు జారీ చేసింది. నందిగ్రామ్ వ్యాప్తంగా నేటి నుంచి 144 సెక్షన్ విధించినట్లు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు..
''మమతా బెనర్జీ, సువేందు అధికారి వంటి అత్యంత ప్రముఖ నేతలు పోటీలో ఉన్నందున ఈ నియోజకవర్గాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించాం. అందుకే శాంతిభద్రతల విషయంలో రాజీపడట్లేదు. ప్రజలు ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు రావాలి. అందుకే ఇక్కడ నిషేదాజ్ఞలు విధించాం. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. పోలింగ్ పూర్తయ్యే వరకు నందిగ్రామ్ ఓటరు కాని ఏ వ్యక్తినీ నియోజకవర్గంలోకి అనుమతించేది లేదు'' అని అధికారులు స్పష్టం చేశారు.

హెలికాప్టర్లతో నిఘా
బుధవారం నుంచి నిందిగ్రామ్ నియోజకవర్గ వ్యాప్తంగా నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడరాదని ఈసీ ఆదేశించింది. మరోవైపు హెలికాప్టర్లతో నిఘా పెంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పోలింగ్ దృష్ట్యా ఈ ప్రాంతంలో 22 కంపెనీల కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు కూడా భారీగా మోహరించారు. నియోజకవర్గానికి వచ్చే అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బయటి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. అల్లర్లకు పాల్పడాలని ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications