ఇదీ బీహార్ ఎన్నికల షెడ్యూల్, బిజెపినే నెం.వన్ అని ఏఏపీ మాజీ నేత
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) బుధవారం విడుదల చేసింది. బీహార్ రాష్ట్రంలో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 6.68 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలుచోట్ల ఉప ఎన్నికలను సీఈసీ ప్రకటించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ దళాలను మోహరిస్తున్నట్లు చెప్పారు. బీహార్లో 47 నియోజకవర్గాలను సమస్యాత్మకంగా తేల్చారు. అక్కడ కేంద్ర బలగాలు మోహరిస్తాయని స్పష్టం చేశారు.
పోలింగ్కు ఐదు రోజుల ముందు స్లిప్లు ఇస్తున్నట్లు చెప్పారు. నేతలు పర్యటనలకు 36 గంటల ముందు అనుమతి తీసుకోవాలని చెప్పారు. నియోజకవర్గానికి రెండు మోడల్ కేంద్రాలు ఉంటాయన్నారు. 48 గంటల ముందు ఒపీనియన్ పోల్స్ నిషేధం అని చెప్పారు.
బీహార్ అెసెంబ్లీ ఎన్నికలు అయిదు విడదల్లో జరగనున్నాయి. అక్టోబర్ 12న తొలి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 16న రెండో విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 28న మూడో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 1వ తేదీన నాలుగో విడత పోలింగ్. నవంబర్ 5న ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి. బీహార్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి వెంటనే అమల్లోకి వస్తుంది.
బీహార్లో ఆధిపత్యశక్తిగా బీజేపీ: ఏఏపీ మాజీ సభ్యుడు యోగేంద్ర
బీహార్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఆధిపత్య శక్తిగా ఆవిర్భ వించనుందని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సభ్యుడు యోగేంద్ర యాదవ్ జోస్యం చెప్పారు. ఒక ఆంగ్ల దినపత్రిక ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడారు.
బీహార్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారన్నది కాదని, రాజకీయంగా ప్రబలమైన శక్తిగా బీజేపీ ఉంటుందన్నారు. మిగతా పార్టీల తీరును పరిశీలిస్తే, బీహార్లో బీజేపీ నంబర్ వన్ రాజకీయ శక్తిగా ఉందన్న విషయం అర్థమవుతుందన్నారు.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల కారణంగా గత రెండు దశాబ్దాలుగా ఉన్న సామాజిక న్యాయ రాజకీయ ప్రయోజనాలను తలకిందులు చేస్తున్నాయన్నారు. ఈ పరిస్థితికి కారణం బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్లేనని యోగేంద్ర ఆరోపించారు.