‘చెల్లింపు’ వార్తల్లోనూ ఏపినే టాప్: 208 కేసులు ఏపివే!
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశంలో నమోదైన చెల్లింపు వార్తల కేసుల్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రభాగాన నిలిచింది. ఇప్పటికే అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దేశం మొత్తమ్మీద పట్టుబడిన నగదులో దాదాపు సగం ఒక్క ఆంధ్రప్రదేశ్లో పట్టుబడిందేనని ఎన్నికల అధికారులు ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు చెల్లింపు వార్తల విషయంలోనూ అదే పరిస్థితి.
దేశ వ్యాప్తంగా మొత్తం 854 చెల్లింపు వార్తల కేసులు నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మొత్తం కేసుల్లోనూ ఆంధ్రప్రదేశ్దే అగ్రస్థానంగా ఉందని అధికారులు చెప్పారు. మొత్తం కేసుల్లో 326 ఇతర రాష్ట్రాలకు చెందినవి కాగా, కేసుల్లో ఆయా పార్టీలకు నోటీసులు పంపినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 208 చెల్లింపు వార్తల కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. వీటిలో 42 కేసుల్లో నోటీసులు అందజేయడం జరిగిందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎక్కువ కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో 118 కేసులు నమోదు కాగా, 23 కేసుల్లో నోటీసులు అందజేయడం జరిగింది. రాజస్థాన్లో 89 కేసులు నమోదు కాగా, 37 నోటీసులు పంపినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 98 కేసులు నమోదు కాగా, 64 కేసుల్లో నోటీసులు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. పంజాబ్ రాష్ట్రంలో 73 కేసులు నమోదు కాగా, 41 కేసుల్లో నోటీసులు పంపించినట్లు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో నమోదైన 61 కేసుల్లో 45 కేసులకు నోటీసులు పంపినట్లు చెప్పారు.
కర్ణాటకలో 34 కేసులు నమోదు కాగా, 15 కేసుల్లో నోటీసులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలో 41 కేసులు నమోదు కాగా, 8 కేసుల్లో నోటీసులు అందజేసినట్లు చెప్పారు. బీహార్ రాష్ట్రంలో 10 కేసులు నమోదు కాగా, ఒక నోటీసు పంపినట్లు, మధ్యప్రదేశ్లో 9 కేసులు నమోదు కాగా, 4 నోటీసులు పంపినట్లు, ఒడిశాలో 15 చెల్లింపు వార్తల కేసులు నమోదు కాగా, ఆరు కేసుల్లో నోటీసులు పంపినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 240 కోట్ల నగదు స్వాధీనం
ఎన్నికల్లో నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దేశవ్యాప్తంగా రూ. 240 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి రూ. 102 కోట్లు ఉండగా, తమిళనాడు నుంచి 39 కోట్లు, కర్ణాటక నుంచి 20 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు 1.32 కోట్ల విలువైన మద్యం, 104 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ఇది ఇలా ఉండగా గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడి చెక్ పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారులో తరలిస్తున్న 400 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొత్తును గుంటూరు నుంచి తెనాలికి తరలిస్తున్నారని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications