అజాం ఖాన్కు షాక్: ఓటు తీసివేసిన ఈసీ, కారణమిదే..?
ఎస్పీ సీనియర్ నేత అజాం ఖాన్ గురించి తెలిసిందే. ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఉంటారు. అనుచిత వ్యాఖ్యలపై కోర్టు తీర్పు నేపథ్యంలో జైలు శిక్ష అనుభవిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన అసెంబ్లీ సభ్యత్వం కూడా కోల్పోయారు. అయితే ఆయనకు ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. అవును ఆయన ఓటును తీసి వేస్తున్నామని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లో గల రాంపూర్ నుంచి అజాం ఖాన్ ఓటును తీసివేశారు. రాంపూర్ ఎలక్టొరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఈ మేరకు తెలిపారు. అతనిపై బీజేపీ బై పోల్ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా ఫిర్యాదు చేశారు. దీంతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
2019లో మోడీపై చేసిన వ్యాఖ్యల ఫలితం వల్ల పరిస్థితి ఇలా అయ్యింది. అజంఖాన్కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన అసెంబ్లీ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాంపూర్ నియోజకవర్గం ఖాళీగా ఉందని అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది.
హేట్ స్పీచ్కు సంబంధించి అజాం ఖాన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతని అప్పీల్ను పరిశీలించమని సుప్రీంకోర్టు రాంపూర్ సెషన్స్ కోర్టును కోరింది. గత వారం అజాం ఖాన్ అప్పీల్ను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దీంతో అతని నియోజకవర్గంలో ఉప ఎన్నికకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో ఎన్నికల సంఘం రాంపూర్కు ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనలతో అజాం ఖాన్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని బీజేపీ కోరింది. ఈ మేరకు ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు.