కరోనా చావులకు ఎన్నికల కమిషన్ కారణం: హత్యకేసు పెట్టాలి: నిప్పులు చెరిగిన హైకోర్టు
చెన్నై: దేశవ్యాప్తంగా రోజూ లక్షలాది సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మరణిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ దుష్ప్రభావానికి దేశ వైద్యా, ఆరోగ్య వ్యవస్థ తలకిందులైంది. ఆక్సిజన్ అందక వందలాది మంది ప్రాణాలను వదులుతున్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఏ స్థాయిలో ఉందో కరోనా సృష్టించిన సంక్షోభ పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి. ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేకపోవడం వల్ల వాటి.. ఆవరణల్లోనే చికిత్సను అందించాల్సిన దుస్థితిని యావత్ దేశం ఎదుర్కొంటోంది.
ఎన్నికల ర్యాలీలు, సభలు హాట్స్పాట్లుగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. ఈ తరహా దారుణ పరిస్థితులు ఎప్పుడూ లేవు. కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. మళ్లీ విరుచుకుపడింది. దీనికంతటికీ కారణం- నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నిర్వహించిన, నిర్వహిస్తోన్న ఎన్నికలే ప్రధాన కారణమనే ఆరోపణలు దేశవ్యాప్తంగా వినిపిస్తోన్నాయి. వేలాదిమందితో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచార సభలను నిర్వహించడం, ఇష్టానుసారంగా రోడ్ షోలను చేపట్టడం, జనాన్ని సమీకరించడం వంటి చర్యలన్నీ కరోనా మహమ్మారి ఉధృత రూపాన్ని దాల్చడానికి దారి తీశాయనే విమర్శలు ఇదివరకే వినిపించాయి.
సెకెండ్ వేవ్కు కారణం
తాజాగా- మద్రాస్ హైకోర్ట్ సైతం ఇదే వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ మొదలు కావడానికి కేంద్ర ఎన్నికల కమిషనే ప్రధాన కారణమని పేర్కొంది. కరోనా చావులన్నీ ఈసీ పుణ్యమేనని తేల్చి చెప్పింది. రాజకీయ పార్టీలన్నీ కోవిడ్ ప్రొటోకాల్స్, కరోనా మార్గదర్శకాలను పాటించేలా చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం దారుణంగా విఫలమైందని స్పష్టం చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంలో ఈసీ కీలక పాత్ర పోషించిందని పేర్కొంది.
కరూర్ అసెంబ్లీ స్థానంలో
అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ సహా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో ఎనిమిది దశల్లో ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఏడో విడత పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నెల 29వ తేదీన చివరి విడత ఓటింగ్ ఉంటుంది. వచ్చేనెల 2వ తదేీన వాటి ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడులోని కరూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 77 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిల్చున్నారు.
పిటీషన్పై విచారణ సందర్భంగా..
ఒక్క నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసినందున- కోవిడ్ ప్రొటోకాల్ మధ్య ఆ స్థానానికి సంబంధించిన ఓట్ల లెక్కింపును చేపట్టేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటీషన్ను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకించింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఈసీపై ధర్మాసనం నిప్పులు చెరిగింది. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రమే కారణమని తేల్చి చెప్పిందీ ధర్మాసనం.
లక్ష్మణరేఖ దాటినా..మౌనమేల?
కోవిడ్ ప్రొటోకాల్, ఎన్నికల మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఎలాంటి రాజకీయ పార్టీపైనా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ అధికారులపై హత్యకేసులను నమోదు చేయాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు ఎన్ని ఆదేశాలను జారీ చేసినప్పటికీ.. వాటిపై చర్యలు తీసుకున్న సందర్భాలు తక్కువేనని అన్నారు. తాము గీసిన లక్ష్మణరేఖను రాజకీయ పార్టీలు దాటుతున్నప్పటికీ- ఎలాంటి చర్యలు చేపట్టకుండా మౌనం దాల్చడం ముమ్మాటికి ఈసీ వైఫల్యమేనని చెప్పారు.