మోడీ-ఈడీ రూటు మారింది: కాంగ్రెస్కు వరం అవుతుందా..!!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు రోజురోజుకూ తీవ్రతరం అవుతోన్నాయి. ఇదివరకు నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవలే ఈడీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉద్వాసనకు గురైన మంత్రి పార్థ ఛటర్జీ, ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ అయ్యారు. విచారణను ఎదుర్కొంటోన్నారు.
వెంకయ్య నాయుడి సేవలు కావాల్సిందే: మోడీ-షా మేధోమథనం: ఏం జరుగుతోంది..!
ఈడీ దాడులతో..
తాజాగా మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ను అరెస్ట్ చేయడం.. ఈడీ అధికారుల దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. పట్ర చాల్ భూ కుంభకోణం కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఎల్లుండి కస్టడీ ముగియాల్సి ఉంది. సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది.
చిక్కని సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని విచారించినప్పటికీ.. ఎలాంటి సాక్ష్యాధారాలను రాబట్టుకోలేకపోయారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో దివంగత పార్టీ నాయకులు మోతీలాల్ వోహ్రా, అహ్మద్ పటేల్ ప్రమేయం ఉందంటూ సాక్ష్యాధారాలతో సహా సోనియాగాంధీ నిరూపించడం వల్ల ఆమెపై తదుపరి చర్యలను తీసుకోలేకపోయారనేది స్పష్టమౌతోంది. దీనితో వారు ఈ కేసులో ముందుకు వెళ్లలేకపోయారు.
పలుచోట్ల సోదాలు..
ఈ నేపథ్యంలో- నేషనల్ హెరాల్డ్ కేసు ఇప్పుడు తెరమీదికి వచ్చింది. ఇదే కేసు విషయంలో ఈడీ అధికారులు ఢిల్లీ సహా పలు చోట్ల దాడులు నిర్వహిస్తోన్నారు. సోదాలను చేపట్టారు. సోనియా గాంధీ విచారణ ముగిసిన అతి కొద్దిరోజుల్లోనే ఈ దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దోషులుగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు సాగుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఢిల్లీ సహా..
దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో ఈ దాడులు కొనసాగిస్తోన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్కు సంబంధించిన ఏ ఒక్క అంశాన్నీ వారు వదలట్లేదు. కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటోన్నారు. దీని తరువాత కాంగ్రెస్ పార్టీకి చెందిన మరి కొంతమంది నాయకులను విచారించే అవకాశాలు లేకపోలేదు.
కాంగ్రెస్కు అనుకూలమా?
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను దోషులుగా నిలబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సాగిస్తోన్న ప్రయత్నాల్లో ఈ తాజా దాడులు భాగమేననే వాదనలు వినిపిస్తోన్నాయి. ఇప్పటికే ఈడీ గానీ, సీబీఐ గానీ, ఆదాయపు పన్ను విభాగం గానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. చెప్పినట్లు చేస్తోన్నాయనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిందని, ఇది కాస్తా కాంగ్రెస్కు అనుకూలంగా మారుతుందనీ అంటున్నారు. ఆయా దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటోందని, ప్రత్యర్థులపై ప్రయోగిస్తోందనీ విమర్శిస్తోన్నారు.