మరో సీనియర్ నేతపై ఈడీ పంజా: భూ కుంభకోణంలో ప్రమేయం: రాష్ట్ర రాజకీయాల్లో కలకలం
ముంబై: దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు తీవ్రతరం అయ్యాయి. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీని ఇటీవలే ఈడీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించారు. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉద్వాసనకు గురైన మంత్రి పార్థ ఛటర్జీ, ఢిల్లీలో ఆమ్ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్.. ఈడీ దాడులకు సంబంధించిన కేసుల్లో అరెస్ట్ అయ్యారు. విచారణను ఎదుర్కొంటోన్నారు.
ఈడీ దాడులతో..
సోనియా గాంధీని ఈడీ అధికారులు విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు లోక్సభ, రాజ్యసభలను స్తంభింపజేశారు. ఈడీ అధికారులు చేస్తోన్న మెరుపుదాడులు, ఆకస్మిక సోదాలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయ్యాయి. పార్టీలకు అతీతంగా ఐక్యంగా పోరాడుతోన్నాయి.
సంజయ్ రౌత్ వంతు..
ఈ పరిస్థితుల మధ్య శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ నివాసంపై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ తెల్లవారు జామునే ముంబైలోని ఆయన నివాసం మైత్రీకి చేరుకున్నారు. సోదాలు సాగిస్తోన్నారు. రెండుసార్లు సమన్లను జారీ చేసినప్పటికీ- ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ అధికారులే ఆయన నివాసానికి వచ్చారు.
భూ కుంభకోణంలో..
మనీ ల్యాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటోన్నారాయన. పట్ర చాల్ భూ కుంభకోణంలో సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. ఈ రెండుసార్లూ విచారణకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది ఈడీ అధికారుల వద్ద తన వాదనలను వినిపించారు. అప్పట్లో మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏక్నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తిన పరిస్థితుల్లో ఆయన విచారణకు హాజరు కాలేకపోయారు.
ఆ కీలక డాక్యుమెంట్లు..
దీనితో వారే స్వయంగా ఈ తెల్లవారు జామున ఆయన నివాసానికి వచ్చారు. సంజయ్ రౌత్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోన్నారు. పట్ర చాల్ భూ కుంభకోణానికి సంబంధించిన కొన్ని కీలక డాక్యుమెంట్లు, ఫిర్యాదులను తీసుకుని వారు సంజయ్ రౌత్ నివాసానికి చేరుకున్నారు. అప్పటికే సిద్ధం చేసుకున్న ప్రశ్నల జాబితాను సంజయ్ రౌత్ ముందుంచారు. ఆయన నుంచి సమాధానాలను రాబట్టుకుంటోన్నారు.