కలకలం: ఈడీ వలలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ కుమార్తె: సమన్లు జారీ!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల అదుపులో ఉన్న ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా డీకే శివకుమార్ లావాదేవీలపైనే నిఘా ఉంచిన ఈడీ అధికారులు తాజాగా ఆయన కుటుంబీకులపైనా కన్నేశారు. డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యకు సమన్లను జారీ చేశారు. ఈ నెల 12వ తేదీ నాటికి తమ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈడీ అధికారులు మంగళవారం ఉదయం బెంగళూరు సదాశివ నగరలోని డీకే శివకుమార్ నివాసానికి వెళ్లారు.
జమ్మూ కాశ్మీర్ భారత్ దే: నిజం ఒప్పేసుకున్న పాకిస్తాన్!
కుటుంబీకులపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఈ సందర్భంగా వారు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఐశ్వర్యకు సమన్లను జారీ చేశారు. ఈ నెల 12వ తేదీ నాటికి తమ విచారణకు హాజరు కావాలని, లేకపోతే అరెస్టును ఎదుర్కోవాల్సి ఉంటుందని సున్నితంగా హెచ్చరించారు. ఐశ్వర్య పేరు మీద సుమారు 78 కోట్ల రూపాయల నగదు ఉన్నట్లు సమాచారం. నేషనల్ గ్లోబల్ కళాశాలలో ఐశ్వర్య ట్రస్టీగా ఉన్నారు.
దీనితోపాటు 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీకే శివకుమార్ రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్ లోనూ ఈ విషయాన్ని పొందుపరిచినట్లు తేలింది. తన కుమార్తె పేరు మీద 108 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు ఆయన ధృవీకరించినట్లు నిర్ధారించారు. 22 సంవత్సరాల వయస్సున్న ఐశ్వర్య పేరు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి జమ అయ్యాయనే విషయంపై ఆరా తీయడానికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. డీకే మరో కుమార్తె ఆరాధన, కుమారుడు ఆకాశ్ పేర్ల మీద పెద్దగా ఆస్తులు గానీ, నగదు గానీ లేనట్లు స్పష్టమైంది.
కాగా ప్రస్తుతం డీకే శివకుమార్ ఢిల్లీలో ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ కస్టడీ ఈ నెల 13వ తేదీ నాటికి ముగియబోతోంది. అంతకంటే ఒకరోజు ముందే- ఈడీ అధికారులు ఆయన కుమార్తెకు సమన్లు జారీ చేయడం, విచారణకు పిలవడం వంటి పరిణామాల నేపథ్యంలో డీకే శివకుమార్ అరెస్టు తప్పదనే వార్తలు గుప్పుమంటున్నాయి.