దాసరికి షాక్: మనీ లాండరింగ్ కేసు, జిందాల్పైనా
న్యూఢిల్లీ: జన్మదిన వేడుకలు జరుపుకున్న మర్నాడే మాజీ కేంద్ర మంత్రి, తెలుగు సినీ దర్శక, నిర్మాత దాసరి నారాయణ రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాక్ ఇచ్చింది. ఆయన ఆదివారం తన 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దాసరి నారాయణరావుపై ఈడి సోమవారంనాడు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది.
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు నవీన్ జిందాల్పై కూడా ఈడి మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం కేసులో ఈడి ఆ కేసు నమోదు చేసింది. సిబిఐ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని ఈడి ఈ కేసు నమోదు చేసింది.
ఈ కేసులోని తన ఫిర్యాదులో మెస్సర్స్ గగన్ స్పాంజ్ ఐరన్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్, మెస్సర్స్ జిందాల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ న్యూ ఢిల్లీ ఎగ్జిమ్ ప్రైవెట్ లిమిటెడ్, మెస్సర్స్ సౌభాగ్య మీడియా లిమిటెడ్లతో పాటు గుర్తు తెలియని వ్యక్తులను కూడా చేర్చింది.
జిందాల్కు చెందిన కంపెనీలకు, హైదరాబాద్కు చెందిన దాసరి నారాయణ రావు కంపెనీలకు మధ్య బహు ముఖాల్లో లావాదేవీలు జరిగినట్లు, జిందాల్ కంపెనీకి 2008లో దాసరి నారాయణ రావు బొగ్గు క్షేత్రాలను కేటాయించినందుకు అక్రమ డబ్బును మళ్లించినట్లు సిబిఐ అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది.