ఆ ఎమ్మెల్యే పై ఈడీ కొరడా..1400 కోట్ల స్కామ్..!!
హర్యానాలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు దన్ సింగ్ నివాసం పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ దాడులు చేసింది. దన్ సింగ్తో పాటు ఆయన సోదరుడి నివాసం, ఫార్మ్హౌజ్లపై ఈడీ సోదాలు నిర్వహించింది. హర్యానా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు దన్రావు ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు దన్ సింగ్ ఇంటిపై గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే ఇంటిని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఒక్క పురుగు కూడా లోపలి నుంచి బయటకు రాకుండా అదే సమయంలో బయటి వారు లోపలికి వెళ్లకుండా ఈడీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. దాడులు, సోదాల నిర్వహణపై ఇటు ఈడీ నుంచి కాని అటు ఎమ్మెల్యే దన్సింగ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన జారీ కాలేదు.

రూ. 1,392 కోట్ల విలువైన మనీలాండరింగ్ విచారణలో భాగంగా మెటల్ ఫ్యాబ్రికేటింగ్ కంపెనీ అలైడ్ స్ట్రిప్స్ లిమిటెడ్ (ASL), దాని ప్రమోటర్లు మొహిందర్ అగర్వాల్, గౌరవ్ అగర్వాల్ మరికొంత మంది నివాసాల్లో కూడా ED బృందం సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హర్యానాలో బహదూర్గఢ్, రేవారీ, మహేంద్రగఢ్, గుడ్గావ్లతో పాటు మొత్తంగా 15 ప్రాంతాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా రావు దన్సింగ్ కుమారుడు ఏఎస్ఎల్ కంపెనీ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోగా ఆ మొత్తం మాఫీ అయినట్లు వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉంటే మహేంద్రగఢ్ ఎమ్మెల్యే రావు దన్ సింగ్ 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధరంవీర్ సింగ్ పై ఓడిపోయారు.ఈ నియోజకవర్గం నుంచి ధరంవీర్ సింగ్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు.మహేంద్రగడ్ నియోజకవర్గంలో రెండు రోజుల క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించి వెనకబడిన వర్గాల వారికోసం ఏర్పాటు చేసిన సమ్మాన్ సమ్మేళన్ సమావేశంలో పాల్గొన్నారు. అమిత్ షా సమావేశంలో ప్రసంగించిన రెండ్రోజులకే ఈడీ దాడులు చేయడం చర్చనీయాంశమైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఆదర్శ్ కోఆపరేటివ్ సొసైటీ స్కామ్లో ఎమ్మెల్యే రావు దన్ సింగ్ కుటుంబం పేరు ఈడీ విచారణలో ప్రధానంగా వినినించింది.2019లో జైపూర్ బ్రాంచ్ ఈడీ ఈ కేసును విచారణకు స్వీకరించింది.హర్యానాలోని రేవారీ, మహేంద్రగఢ్, నార్నాల్ ప్రాంతాల్లో ఓ కంపెనీ పేరుతో భూమిని కొనుగోలు చేసినట్లు ఈడీ విచారణలో బయటపడింది.ఈ కేసుతో 100 మందికి పైగా సంబంధాలున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ క్రమంలోనే దన్సింగ్ కుమారుడు ఆక్షత్ రావుకు కూడా సంబంధం ఉన్నట్లు తెలిసింది.
లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో రావు దన్ సింగ్ లేదా అతని కుటుంబ సభ్యులపై ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి కేసులు లేవు.తన కొడుకు పై ఉన్న కేసును కూడా మూసివేసినట్లు తెలుస్తోంది.ఒక కంపెనీతో జరిగిన లావాదేవీల్లో భాగంగా ఈడీ విచారణ చేయగా వచ్చిందే తప్పితే... స్కామ్కు తన కొడుకుకు ఎలాంటి సంబంధం లేదని దన్సింగ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈడీ కొరడా ఝుళిపించడం చూస్తోంటే చాలా అనుమానాలకు తావిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications