మోడీతో భేటీ అయిన సీఎం పళనిసామి: పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టాలని !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బుధవారం న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. పన్నీర్ సెల్వం వర్గానికి కేంద్రంలో చెక్ పెట్టడానికి పళనిసామి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని సమాచారం.
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి బుధవారం న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడిని కలిశారు. ఈ సందర్బంలో తమిళనాడుకు సంబంధించిన అనేక సమస్యలపై ఎడప్పాడి పళనిసామి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారని తెలిసింది.
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి తాను తమిళనాడులోని అనేక అభివృద్ది పనులు, అనేక కొత్త ప్రాజక్టుల విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారని వివరణ ఇచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సమయంలో తాము రాజకీయాల గురించి మాట్లాడలేదని ఎడప్పాడి పళనిసామి మీడియాకు చెప్పారు. అయితే కేవలం అభివృద్ది పనులు, రైతు రుణాల మాఫీ, ప్రాజక్టుల విషయంపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారా ? అని మీడియా ప్రశ్నిస్తే అవును, అంతే మరేం లేదు అంటూ పళనిసామి చెప్పారు.
ఇటీవల తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీ చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. పన్నీర్ సెల్వంకు పోటీగా వారం రోజులు పూర్తి కాకముందే సీఎం హోదాలో ఎడప్పాడి పళనిసామి ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
పన్నీర్ సెల్వం వర్గానికి కేంద్రంలో చెక్ పెట్టడానికి పళనిసామి ఎత్తులు వేస్తున్నారని సమాచారం. ఎడప్పాడి పళనిసామి ఢిల్లీ పర్యటనలో తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ తో సహ అనేక మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గోన్నారు.