ఘోర ప్రమాదం: బస్సు-ట్రక్కు ఢీ, 8మంది మృతి
తిరుచ్చి: తమిళనాడులోని మదురై-తిరుచ్చి జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు- ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 25మందికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐచర్ ట్రక్కులో సుమారు 65మంది ప్రయాణికులు దిండిగల్ జిల్లాలోని అమ్మపట్టి నుంచి తిరుచ్చి జిల్లాలోని కోవిల్పట్టి గ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన బస్సు కూడా మదురై నుంచి తిరుచ్చి వెళుతోంది.
ట్రక్కు, బస్సు ఢీకొనడంతో ట్రక్కులోని పలువురు ప్రయాణికులు రోడ్డుపై పడ్డారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. గాయపడిన వారిని తిరుచ్చిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మనప్పరాయిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిరుచ్చి జిల్లా కలెక్టర్ కెఎస్ పలనిస్వామి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.