వికటించిన కుని ఆపరేషన్లు: 8 మంది స్త్రీలు మృతి
రాయపూర్: ఛత్తీస్గడ్ రాష్ట్రంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వైద్య శిబిరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి 8 మంది మహిళలు మరణించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం వల్లనే ఈ మరణాలు సంభవించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఛత్తీస్గడ్లోని బిలాస్పూర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వైద్య శిబిరంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లు మంగళవారంనాడు వార్తలు వచ్చాయి. మిగతా కొంత మంది మహిళల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సంఘటనపై విచారణ జరపడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని వేసింది. ఈ వైద్య శిబిరాన్ని ఆరోగ్య శాఖ మంత్రి అమర్ అగర్వాల్ సొంత జిల్లా బిలాస్పూర్లో శనివారంనాడు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై రమణ్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెసు విరుచుకుపడింది.
కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఆ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న మహిళలకు ఒక్కొక్కరిరకి 1400 రూపాయలు, వర్కర్లకు ఒక్క మహిళను తెస్తే 200 రూపాయల చొప్పున ఇస్తారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు నాయకుడు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి అమర్ అగర్వాల్ రాజీనామాకు ఆయన డిమాండ్ చేశారు.
బిలాస్పూర్ ఘటనపై ప్రధాని మోడీ సంతాపం
శస్త్ర చికిత్స వికటించి మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. సాయంత్రానికి ఈ సంఖ్య పదికి చేరుకుంది. మయన్మార్లో ఉన్న మోడీ ఈ ఘటన పైన సంతాపం తెలిపారు. చత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్తో ఫోన్లో మాట్లాడారు. ఘటన పైన విచారణ చేపట్టాలన్నారు. మరో 15 మంది పరిస్ధితి విషమంగా ఉంది.
నలుగురు వైద్యులతో కూడిన ఎయిమ్స్ బృందం రేపు ఛత్తీస్ గఢ్లోని బిలాస్ పూర్ వెళ్తోంది. కుటుంబ శస్త్రచికిత్సలు వికటించిన ఘటనలో పరిస్ధితి విషమంగా ఉన్న మహిళలకు చికిత్స చేయడానికి ఈ బృందం బిలాస్పూర్ వెళ్తోంది.












Click it and Unblock the Notifications