ముగిసిన ఎన్నికల ప్రచారం- 14న మూడు రాష్ట్రాల్లో పోలింగ్ : అందరి చూపు అటే..!!
దేశంలో సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మూడు రాష్ట్రాల్లో ఈ నెల 14న పోలింగ్ జరగనుంది. ఉత్తర ప్రదేశ్ లో రెండో విడత పోలింగ్ కాగా... గోవా తో పాటుగా ఉత్తరాఖండ్ లో ఎన్నికల నిర్వహణకు తుది ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఉత్తర ప్రదేశ్ లో ఈ నెల 10వ తేదీన తొలి విడత పోలింగ్ ముగిసింది. తొలి సారి జరిగిన పోలింగ్ లో 58 స్థానాలకు ఎన్నిక లు జరిగాయి. దీంతో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఉత్తరప్రదేశ్ లో రెండో విడత పోలింగ్ లో భాగంగా.. జిల్లాల్లోని 55 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
ఇందుకోసం సహరాన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, బరేలీ, అమ్రోహా, షాజహాన్పూర్, బదౌన్లలో రాజకీయ పార్టీల పెద్ద నాయకులు, స్టార్ క్యాంపెయినర్లు ఫాస్ట్ మీటింగ్లు నిర్వహించి తమకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం చేసారు. రాంపూర్లో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వర్చువల్ ర్యాలీ నిర్వహించి తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు అడిగారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో సహారన్పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, అమ్రోహా, రాంపూర్, బదౌన్, బరేలీ మరియు షాజహాన్పూర్ జిల్లాలు ఉన్నాయి.
భద్రతా ఏర్పాట్ల కోసం 800 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తున్నారు. ఉత్తరాఖండ్ లో మొత్తం 70 సీట్లకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 14వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 70 స్థానాలకు 623 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. 81 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 40 సీట్లు ఉన్న గోవా అసెంబ్లీకి ఈ నెల 14వ తేదీన పోలింగ్ జరగనుంది. 332 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలిచారు. 11.6 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఇప్పటికే గోవాలో ప్రధాని మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సహా.. కేజ్రీవాల్...మమతా బెనర్జీ..రాహుల్ గాంధీ వంటి వారు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. ఈ సారి గోవాలో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ భావిస్తోంది. ఒకే విడతలో ఇక్కడ పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో చివరిసారిగా ఫిబ్రవరి 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. బీజేపీ 13 సీట్లు గెలుచుకుని ఎంజీపీ, జీఎఫ్పీ, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కాగా, ఉత్తర ప్రదేశ్ లో మొత్తం ఏడు విడతల పోలింగ్ లో భాగంగా రెండో విడత... గోవా - ఉత్తరాఖండ్ లో పోలింగ్ జరగనుంది. వీటన్నింటికి కౌంటింగ్ ప్రక్రియ మార్చి 10న నిర్వహించనున్నారు.