బంగ్లాదేశ్లో బెంగాల్ వ్యాఖ్యలా-మోడీ వీసా రద్దు చేయాలి- మమత డిమాండ్
పశ్చిమబెంగాల్లో ఓవైపు తొలిదశ ఎన్నికలు జరుగుతుండగా.. మరోవైపు మిగతా ప్రాంతాల్లో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తన బంగ్లాదేశ్ పర్యటనలో బెంగాల్ గురించి చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటమేంటని ఆమె ఫైర్ అయ్యారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల కోసం ఖరగ్పూర్లో ప్రచారం చేసిన సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీ తీరుపై మరోసారి విరుచుకుపడ్డారు. పశ్చిమబెంగాల్లో ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ మాట్లాడలేక బంగ్లాదేశ్ వెళ్లి మాట్లాడతారా అంటూ ప్రధాని మోడీని ఆమె ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అన్నారు. దీనిపై ఈసీ స్పందించి చర్యలు తీసుకోవాలని మమత డిమాండ్ చేశారు. ఓవైపు మమత బంగ్లాదేశ్ నంచి చొరబాటుదారుల్ని తీసుకొస్తున్నారని మోడీ విమర్శిస్తారని, మరోవైపు బంగ్లాదేశ్ వెళ్లి ఎన్నికల మార్కెటింగ్ చేసుకుంటారని మమత విమర్శలు గుప్పించారు.
2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా బంగ్లాదేశ్కు చెందిన ఓ నటుడు బెంగాల్కు ప్రచారం కోసం వచ్చారని, దీంతో బీజేపీ సర్కారు బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి అతని వీసాను రద్దు చేయించిందని మమత గుర్తు చేశారు. కానీ ఇప్పుడు బెంగాల్ ఎన్నికల వేళ ఓ వర్గం ఓట్ల కోసం బంగ్లాదేశ్లో మోడీ తిరుగుతున్నారని మమత ఆక్షేపించారు. మీ వీసా ఎందుకు రద్దు చేయకూడదని ఆమె మోడీని ప్రశ్నించారు. మోడీ తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని మమత తెలిపారు.