జులై 28 వ తేది బెంగళూరు ఎన్నికలు: కోడ్ అమలు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలకు రంగం సిద్దం అయ్యింది. బెంగళూరు నగరంలోని 198 వార్డులలో జులై 28వ తేదిన ఎన్నికలు జరగనున్నాయి. ఐటీ, బీటీ సిటిలో ఒకే రోజు అన్ని వార్డులలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
గురువారం కర్ణాటక ఎన్నికల కమీషనర్ పీ.ఎన్. శ్రీనివాసాచారి వివరాలు వెల్లడించారు. బెంగళూరు నగరంలోని 198 వార్డులలో ఒకే రోజు పోలింగ్ జరుగుతుందని అన్నారు. జులై 31వ తేదిన ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. అవసరం అయితే జులై 30వ తేది రీ పోలింగ్ ఉంటుందని చెప్పారు.
జూన్ 25వ తేది గురువారం నుండి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని అన్నారు. జులై 8వ తేదిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, జులై 15వ తేది నుండి ఎన్నికలలో పోటి చేసే వారు నామినేషన్ పత్రాలు సమర్పించడానికి అవకాశం కల్పిస్తున్నామని అన్నారు.
జులై 20వ తేది లోపు నామినేసన్లు ఉపసంహరించడానికి అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. 198 వార్డులలో జరిగే పోలింగ్ కు 11,635 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఉపయోగిస్తున్నామని వివరించారు. ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థులు రూ. 5 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టరాదని చెప్పారు.
బెంగళూరు నగరంలో మొత్తం 71,22,165 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అందులో 37,38,808 మంది పురుషులు, 33,82,231 మంది మహిళలు, 1,126 మంది ఇతర ఓటర్లు ఉన్నారని అన్నారు. ఎన్నికల నియమాలు ఉల్లంఘిచే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఇదే సమయంలో శ్రీనివాసాచారి హెచ్చరించారు.
కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ.........!
బెంగళూరు నగరం మూడు భాగాలు చెయ్యాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. దాని కోసం ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే హై కోర్టు, సుప్రీం కోర్టులు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే సుప్రీం కోర్టులో మళ్లి అప్పీలు చెయ్యాలని సిద్దరామయ్య ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
ఇదే సమయంలో ఎన్నికల తేదీని ప్రకటించడంతో కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలింది. బెంగళూరులోని 198 కార్పొరేటర్ల బలాబలాల సంఖ్య ఈ విధంగాగా ఉంది. బీజేపీకి 112 మంది, కాంగ్రెస్ కు 67 మంది, జేడీఎస్ కు14 మంది, ఇతర కార్పొరేటర్లు 5 మంది ఉన్నారు.