ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు సుప్రీం ఊరట- ఎలక్టోరల్ బాండ్ల జారీకి ఓకే
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లు జారీ చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు దుర్వినియోగం కాకుండా తగిన ఏర్పాట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే అభిప్రాయపడ్డారు.
ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ఎలక్ట్రోరల్ బాండ్లు జారీ చేయకుండా అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్పై సీజేఐ బాబ్డేతో పాటు జస్టిస్ బోపన్న, వి. రామసుబ్రమణియమ్తో కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఎలక్ట్రోరల్ బాండ్లు జారీ చేయడం అనేది తరచుగా జరిగే ప్రక్రియేనని ధర్మాసనం అభిప్రాయపడింది. మూడేళ్లుగా ఎలక్ట్రోరల్ బాండ్లు జారీ అవుతూనే ఉన్నాయని గుర్తు చేసింది. కాబట్టి దీన్ని ఇప్పుడు అడ్డుకోవాలని కోరడం సమజసం కాదని తెలిపింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్ను కొట్టేసింది.
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల జారీ ద్వారా నిధుల సేకరణకు వీలుంది. ఇలా జారీ చేస్తున్న ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు తీవ్రవాదులు, ఇతర సంఘ వ్యతిరేక శక్తుల ద్వారా నిధులు అందుతున్నాయని, వీటిపై కేంద్రం నియంత్రణ లేదంటూ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం.. ఎలక్ట్రోరల్ బాండ్లకు అందుతున్న నిధులపై నియంత్రణ ఉందా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు వీటి జారీపై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది.