ఢిల్లీకి చేరిన విశాల్ నామినేషన్ పంచాయితీ, వివరణ ఇచ్చిన వేలుస్వామి, అంతే !
న్యూఢిల్లీ: తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రముఖ హీరో, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ నామినేషన్ తిరస్కరణ పంచాయితీ ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ దగ్గరకు చేరింది.
తమిళనాడు రాష్ట్ర ఎన్నికల అధికారులు కావాలనే తన నామినేషన్ పత్రాలను తిరస్కరించారని, న్యాయం చెయ్యాలని బుధవారం హీరో విశాల్ ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. విశాల్ ఫిర్యాదు స్వీకరించిన భారత ఎన్నికల కమిషన్ విచారణ మొదలు పెట్టింది.
భారత ఎన్నికల కమిషన్ చీఫ్ రాజేష్ లకోని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని సంప్రధించారు. విశాల్ నామినేషన్ పత్రాలు ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది అనే విషయంపై పూర్తి సమాచారాన్ని తమిళనాడు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామి వివరించారు.
ఇప్పుడు హీరో విశాల్ నామినేషన్ తిరస్కరణ పంచాయితీ ఢిల్లీకి చేరింది. విశాల్ నామినేషన్ తిరస్కరణ విషయంలో భారత ఎన్నికల కమిషన్ చీఫ్ రాజేష్ లకోని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.