సొంత కుటుంబాన్నే.. 10మందిని కిరాతకంగా హతమార్చి..
బ్యాటరీల షాపులో పనిచేసే జమాలుద్దీన్ అనే వ్యక్తి తన కుటుంబానికే చెందిన 10మందిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
అమేథీ: ఏమైందో తెలియదు.. ఎందుకంతలా కక్ష సాధించాలనుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. కుటుంబం మొత్తాన్ని హత్య చేశాడు. చివరికి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
అతని మారణహోమానికి మొత్తం పదిమంది ప్రాణాలు బలికాగా.. చావు-బ్రతుకుల మధ్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతని భార్య ప్రాణాలతో బయటపడితే గానీ అసలు నిజం వెల్లడయ్యే అవకాశం లేదు.
ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ నియోజకవర్గం అమేథీ పరిధిలోని సుల్తాన్ పూర్ జిల్లా సుకుల్ బజార్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానికంగా బ్యాటరీల షాపులో పనిచేసే జమాలుద్దీన్ అనే వ్యక్తి తన కుటుంబానికే చెందిన 10మందిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
అందరూ నిద్రపోతున్న సమయంలో ఇంటికి చేరుకున్న జమాలుద్దీన్ వారిపై దాడికి పాల్పడ్డాడు. భార్యా పిల్లలతో పాటు ఇంట్లో ఉన్న బంధువులపై కూడా దాడి చేశాడు. అసలేమాత్రం అనుమానం రాకుండా.. అలికిడి లేకుండా.. ఒకరి తర్వాత ఒకరిని చంపుకుంటూ పోయాడు. చివరికి ఇంట్లోనే ఉరేసుకుని జమాలుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
జమాలుద్దీన్ కిరాతక పర్వానికి ఇళ్లంతా శవాలగుట్టలా మారిపోయింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఉదంతాన్ని గమనించిన స్థానికులు నిర్ఘాంతపోయారు. చనిపోయిన వారిలో ఆరుగురు చిన్నపిల్లలు ఉండటం గమనార్హం.
ఘటనలో నిందితుడు సహా 10మంది ప్రాణాలు కోల్పోగా.. నిందితుడి భార్య మృత్యువుతో పోరాడుతోంది. సుల్తాన్ పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమె బ్రతికితే గానీ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు తెలిసే అవకాశం లేదు.