షాకింగ్: లాక్డౌన్ వల్ల ఉద్యోగం పోయిందా? జీతంలో కోత పడిందా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దిశగా వేగంగా కదులుతోంది. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రానందున లాక్డౌన్ గడువును మరింతకాలం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్థిక వ్యవస్థ దాదాపుగా స్థంభించడంతో దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. దాదాపు అన్ని రంగాల వాళ్లకు జీతాల్లో కోతలు విధించారు. నిజానికి లాక్ డౌన్ కాలంలో కంపెనీల యాజమాన్యాలు.. ఉద్యోగులను తొలగించరాదని, పని చేయకున్నా నూటికి నూరు శాతం జీతాలు చెల్లించాల్సిందేనని కేంద్ర హోం శాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అయినాసరే కోతలు ఆగలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకంగా కేంద్రం ఆదేశాలపైనే స్టే ఇస్తూ షాకింగ్ ఉత్తర్వులిచ్చింది..

యజమానుల జోలికెళ్లొద్దు..
లాక్ డౌన్ సమయంలో ఏవైనా కంపెనీలు లేదా సంస్థలు ఉద్యోగులను తొలగించినా, జీతాల్లో కోతలు విధించినా ఆ చర్యను నేరంగా పరిగణిస్తామని, యాజమాన్యాలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం శాఖ మార్చి 25న ఉత్తర్వులిచ్చింది. అసలు ఉత్పత్తే లేకపోతే ఉద్యోగులకు జీతాలెలా ఇవ్వగలమని వాపోతూ, హోం శాఖ ఆదేశాలను రద్దు చేయాల్సిందిగా వందలాది ప్రైవేటు కంపెనీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి. వాటిపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం.. ఎకాఎకిన హోం శాఖ ఆదేశాలను నిలిపివేసింది. ‘‘ఉద్యోగులను తొలగించారనో, జీతాలు చెల్లించలేదనే కారణంగా యాజమాన్యాలపై ప్రభుత్వాలు చర్యలకు దిగొద్దు. ఇప్పుడప్పుడే వాళ్లజోలికి వెళ్లొద్దు..''అని హెచ్చరించింది.

పీఎఫ్ తీయకుండా ప్రైవేటుపై చర్యలా?
ఉద్యోగుల తొలగింపు, జీతాల కోతలు అంశంపై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 41 ఎంఎస్ఎంసీల కూటమిగా ఉన్న లూథియానా హ్యాండ్ టూల్స్ అసోసియేషన్, ఫికస్ పాక్స్ అసోసియేషన్లు పిటిషనర్లలో ప్రముఖులుగా ఉన్నారు. ‘‘కార్మికులు పనిచేసి జీతాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో, పని జరిగితేనే యజమాని జీతాలు చెల్లించడం కూడా అంతే ముఖ్యం. పరస్పరం ఆధారపడే ఈ అంశాన్ని కేంద్రం సరిగా అర్థం చేసుకోలేదు. ఉత్పత్తి లేకపోయినా ఉద్యోగులకు జీతాలు ఎక్కణ్నుంచి తెచ్చివ్వాలి? కార్మికుల ప్రావిడెంట్ రూపంలో ప్రభుత్వం దగ్గర కొన్ని కోట్ల రూపాయలు పోగుపడ్డాయి. వీలైతే వాటిని బయటికి తీసి, జీతాలుగా పంచాలేతప్ప, ప్రైవేటు సంస్థలపై చర్యలు తీసుకుంటామని బెదిరించడం కరెక్ట్ కాదు''అని పిటిషషన్లు వాదించారు.

గడువు కోరిన కేంద్రం..
లాక్ డౌన్ 4.0 కూడా అమలులోకి రానున్నవేళ.. ఉద్యోగుల తొలగింపు, జీతాల కోతల అంశంలో హోం శాఖ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో కేంద్రం ప్రభుత్వం ఆలోచనలో పడింది. దీనిపై కౌంటర్ ఫైల్ చేయడానికి వారం రోజులు గడువు కావాలని కోరింది. దీంతో కోర్టు.. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ఇదే ధర్మాసం శుక్రవారం మరో సంచలన చర్యకు దిగింది. వలస కూలీల వెతలపై తాము స్పందించబోమని, మాట చెప్పినా వినిపించుకోని కూలీలకు సంబంధించిన పిటిషన్లు విచారించబోమని, ఏదేనా ఉంటే రాష్ట్రాలే చూసుకోవాలని అనూహ్య కామెంట్లు చేసింది.

దేశంలో 67 శాతం ఉద్యోగ,ఉపాధి గాయబ్..
మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమంది ఉపాధి పొందుతున్నది ఎంఎస్ఎంఈ రంగంలోనే అని తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా 50 రోజులకు పైగా అన్ని కంపెనీలతోపాటు చిన్నా,మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి. అందులో పనిచేస్తోన్న వాళ్లంతా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. గృహకార్మికులు, భవన నిర్మాణ కార్మికులు సైతం ఉపాధి కోల్పోయారు. మొత్తంగా లాక్ డౌన్ వల్ల దేశంలో 67 శాతం మంది పని కోల్పోయారని తాజా స్వేలు చెబుతున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే 12.2 కోట్ల మంది నిరుద్యోగులుగా మారినట్లు వెల్లడైంది. కంపెనీలపై న్యాయపోరాటం చేసే వీలు కూడా లేకపోవడంతో రోడ్డునపడ్డవాళ్ల పరిస్థితి ఇంకా దారుణంగా తయారయ్యే ప్రమాదముంది.












Click it and Unblock the Notifications