రాజౌరీ అడవుల్లో భీకర ఎన్కౌంటర్: ఆరుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత సైన్యం
జమ్మూకాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో భారీగా చొరబడిన ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి భద్రతా బలగాల తనిఖీలు సాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇక తాజాగా రాజౌరీ సెక్టార్లోని దట్టమైన అడవులు తుపాకుల మోతతో దద్దరిల్లాయి. రాజౌరీ సెక్టార్లో జరుగుతున్న ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఆధారిత లష్ఖర్-ఇ-తోయిబా (ఎల్ఈటీ) కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టు బెట్టింది. మిగిలిన నలుగురు ఇస్లామిక్ జిహాదీలను మట్టుబెట్టడం కోసం 16 భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ప్రస్తుతం ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
బిపిన్ రావత్ ఆదేశాలతో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
రాజౌరీ అడవుల్లో ఉగ్రవాదులు చొరబడ్డారన్న పక్కా సమాచారంతో ఉగ్రమూకను ఏరివేయడం లో భాగంగా భారత సైన్యం రంగంలోకి దిగింది. వారం రోజులుగా భద్రతా దళాలు విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ సాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్ లో భారత సైన్యం తమ జవాన్లను తొమ్మిది మందిని కోల్పోయింది. ఆ తరువాత ప్రతీకారం తీర్చుకునే పనిలో పడింది ఇండియన్ ఆర్మీ . చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ అక్టోబర్ 16 న రాజౌరీ ప్రాంతాన్ని సందర్శించి, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహిస్తున్న స్థానిక కమాండర్లతో చర్చలు జరిపారు. ఎలాగైనా వారిని అంతమొందించాలని ఆదేశించారు.
రాజౌరీ అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు
టెర్రరిస్టులను తుదముట్టించడానికి తీసుకోవలసిన చర్యలు, భద్రత పెంపు పై స్థానిక కమాండర్స్ తో మాట్లాడిన బిపిన్ రావత్ వారికి సూచనలు చేశారు. భారత సైనికులు ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి మెరుపు వేగంతో ముందుకు సాగుతున్నారు. రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదుల ఉనికితో ఆ ప్రాంతం చుట్టూ కార్డన్ సెర్చ్ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. వ్యూహాలలో మార్పు చేసి ఉగ్రవాదులు చొరబడిన అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉగ్రవాదులను టార్గెట్ చేస్తున్నారు భారత సైన్యం.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద చొరబాట్లు ... విఫలం చేస్తున్న భారత సైన్యం
ఒక్క రాజౌరీ సెక్టార్ మాత్రమే కాకుండా జమ్మూ కాశ్మీర్ మొత్తంగా అనేకచోట్ల పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. తాలిబాన్ ఆక్రమిత ఆఫ్ఘనిస్తాన్ లా వారు జమ్మూ కాశ్మీర్ ని ఆక్రమించాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారిపై ఉక్కుపాదం మోపడానికి ఎత్తున ప్రయత్నాలు సాగిస్తున్నారు. సౌత్ బ్లాక్ సమాచారం ప్రకారం, గత రెండు, మూడు నెలల్లో పాకిస్తాన్ నుండి రాజౌరి-పూంచ్ జిల్లా సరిహద్దుల మధ్య అటవీ ప్రాంతంలో తొమ్మిది నుండి 10 మంది ఎల్ఈటీ ఉగ్రవాదులు చొరబడ్డారు.
సామాన్యుల ప్రాణాలు తీస్తున్న ఉగ్ర మూక .. రంగంలోకి ఎన్ఐఏ
గత కొంత కాలంగా జమ్మూ కాశ్మీర్ నియంత్రణ రేఖపై మరియు కంచె వెంట అనేక చొరబాటు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ తరహాలో భారతదేశంలో కూడా చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. అనేక చొరబాటు యత్నాలను, భారీ ఉగ్ర దాడుల కుట్రలను భద్రతా దళాలు ఇప్పటికే భగ్నం చేశాయి.
ఇదిలా ఉంటే వ్యూహం మార్చిన టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ లో వలస కూలీలను, ముస్లిమేతరులను మట్టుపెట్టే పనిలో పడ్డారు. ఇటీవల కాలంలో సుమారు 11 మంది సామాన్యుల ప్రాణాలు తీశారు. ఉగ్రవాదులు సామాన్యుల ప్రాణాలు తీస్తున్న క్రమంలో ఎన్ఐఏ ఈ ఘటనల దర్యాప్తుకు రంగంలోకి దిగింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదులకు, భారత భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న ప్రచ్చన్న యుద్ధంతో భయం గుప్పిట్లో మగ్గుతుంది.