అర్ధరాత్రి 5గురు మహిళలపై ఐదుగురు..: వీడియో తీసి
బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఎంజీ రోడ్డులో ఐదుగురు మహిళ పైన ఐదుగురు వ్యక్తులు శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు దాడికి యత్నించారు. సదరు మహిళలు కారులో ఉండగా వారు దాడికి యత్నించారు. అయితే, ఓ మహిళ వెంటనే తన ఫోన్ ద్వారా వారి ఫోటోలను క్లిక్మనిపించారు. అనంతరం రక్షించాలని అరవడం ప్రారంభించారు. వారు అరవడంతో ఐదుగురు కూడా అక్కడి నుండి పరారయ్యారు. సదరు మహిళలు కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం... శనివారం రాత్రి ఓ 27 ఏళ్ల మహిళ తన నలుగురు మహిళా స్నేహితురాళ్లతో కలిసి ఐస్ క్రీం కోసం వెళ్లారు. వారు ఎంజీ రోడ్డులోని ఐస్ క్రీం పార్లర్కు తమ టయోటా ఇన్నోవాలో వెళ్లారు. డ్రైవర్ ఐస్ క్రీం తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ముగ్గురు వ్యక్తులు కారు వద్దకు వచ్చి నిలబడ్డారు. వారు దాదాపు పదిహేను నిమిషాలు నిలబడ్డారు. కాసేపటికి ఆ ముగ్గురుకి మరో ఇద్దరు కలిశారు. ఒకరు వారి కారు డోర్ తెరిచేందుకు ప్రయత్నించారు.
అంతలో సదరు మహిళ స్నేహితురాలు అప్రమత్తమై డోర్ లాక్ చేశారు. అనంతరం వారు జేబులో నుండి ఏవో తీసి కారు డోర్ తెరిచే ప్రయత్నాలు చేశారు. దీంతో వారు భయపడి కేకలు వేయడం ప్రారంభించారు. అదే సమయంలో మహిళలు వ్యక్తుల ఫోటోలను క్లిక్ మనిపించారు. వీడియో తీశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇద్దరి అరెస్టు
ముగ్గురు మైనర్ బాలికల పైన లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అశోక్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో బాలికలు ఇంట్లో పని చేస్తుంటారు. వారి పైన ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
మహిళపై యాసిడ్ దాడి
చిక్బళ్లాపూర్లో ఓ మహిళ పైన యాసిడ్ దాడి జరిగింది. 41 ఏళ్ల మహిళ చిక్బళ్లాపూర్లోని మంచెనహళ్లిలో ఉంటున్నారు. ఆమె తాను పని చేసే ప్రాంతానికి వెళ్తుండగా.. యాసిడ్ దాడి జరిగింది. ఆమెను గౌరిబిడనూర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.