అభినందన్ ను చూసి ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు .. వింగ్ కమాండర్ పై మోదీ ప్రశంసలు
తమిళనాడు :వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను చూసి ప్రతీ భారతీయుడు గర్వపడుతున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. 50 ఏళ్ల తర్వాత వైమానిక దాడులు చేపట్టామని .. శత్రు దేశాన్ని అభినందన్ సమర్థవంతంగా తిప్పికొట్టారని ప్రశంసించారు.
ఆయనను చూసి దేశం గర్విస్తోంది
తమిళనాడులోని కన్యాకుమారిలో శుక్రవారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ .. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వింగ్ కమాండర్ అభినందన్ ను చూసి దేశం గర్విస్తోందన్నారు. బుధవారం పాకిస్థాన్ కు చిక్కిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీ .. అభినందన్ పేరును ప్రస్తావించారు. గత కొన్నిరోజులుగా మన సైన్యం శక్తి, సామర్థ్యాలను ప్రదర్శిస్తోందని .. దీనిని దేశం నిశీతంగా గమనిస్తోందని చెప్పారు. సరిహద్దులో అసమాన పోరాట పటిమ పాటిస్తోన్న సైనికులకు వందనం అని కీర్తించారు
జెనీవా ఒప్పందం మేరకు విడుదల
ఇరుదేశాల మధ్య ఉన్న జెనీవా ఒప్పందం మేరకు అభినందన్ ను పాకిస్థాన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా విడుదల చేయకుంటే యుద్ధం ప్రారంభమైనట్టు భావించాల్సి వస్తుందని ... అందుకే జంకి అభినందన్ ను వదలినట్టు పేర్కొన్నారు.
యధేచ్చగా చట్టాల ఉల్లంఘన
గత కొన్నిరోజులుగా పాకిస్థాన్ అంతర్జాతీయ చట్టాలను విస్మరిస్తోందని ఆరోపించారు. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితికి ఆ దేశం అనుసరించిన వైఖరే .. కారణమని విమర్శించారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే చర్చలంటుందని మండిపడ్డారు. అలాగే తమకు పట్టుబడ్డ సైనికుల పట్ల పాకిస్థాన్ ప్రవర్తించిన తీరును ఎండగట్టారు.