వాళ్లు చనిపోయినా, బ్రతికున్నా బయటకుతీసుకురండి: మేఘాలయ గని కార్మికులపై సుప్రీం కోర్టు
Recommended Video

షిల్లాంగ్: మేఘాలయలోని మైన్స్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వారు ఇరవై రోజుల క్రితం అందులో చిక్కుకున్నారు. వారిని బయటకు తెచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గనిలో చిక్కుకున్న కార్మికులను కాపాడే విషయమై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై సుప్రీం కోర్టు గురువారం స్పందించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి సెకండ్ లెక్కకు వస్తుందని, గనిలో చిక్కుకున్న వారి ప్రాణాలతో ఉన్నా, లేకున్నా సరే వారిని బయటకు తేవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ కార్మికులు ప్రాణాలతో బయటపడాలని న్యాయస్థానం ప్రార్థించింది.

వారిని కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సహాయకచర్యలపై తాము సంతృప్తిగా లేమని, ఇది చాలా తీవ్రమైన అంశమని, జీవన్మరణ సమస్య అని, కార్మికులు చిక్కుకుని చాలా రోజులు గడుస్తున్నా ప్రభుత్వం సహాయక చర్యల కోసం ఆర్మీని ఎందుకు కోరలేదని, కార్మికులు బతికున్నా, చనిపోయినా సరే వారిని బయటకు తీసుకురావాలని, వారంతా ప్రాణాలతో బయటపడాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నామని కోర్టు తెలిపింది.
గనిలో చిక్కుకున్న కార్మికుల విషయంలో ప్రతి సెకండ్ విలువైనదని, వారిని బయటకు తెచ్చేందుకు తక్షణ, సమర్థమైన సహాయకచర్యలు అవసరమని పేర్కొంది. ఈ విషయాన్ని తక్షణమే పరిశీలించాలని సొలిసిటర్ జనరల్ను ఆదేశించింది. కార్మికులను బయటకు తెచ్చేందుకు చేపట్టిన చర్యలపై నివేదికను శుక్రవారం కోర్టుకు సమర్పించాలని పేర్కొంది.
కాగా, మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో గత ఏడాది డిసెంబర్ 13వ తేదీన పదిహేను మంది కార్మికులు బొగ్గు గనిలోకి వెళ్లి చిక్కుకున్నారు. దట్టమైన చెట్లతో కూడిన కొండపై ఉండే ఎలుక బొరియల్లో అక్రమగా బొగ్గు తవ్వేందుకు కూలీలు వెళ్లారు. పక్కనే ప్రవహిస్తున్న లిటిల్ నది నీరు గనిలోకి రావడంతో కార్మికులు చిక్కుకుపోయారు. ఇందులో కొందరు బయటపడ్డారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, వైమానిక దళం, అగ్నిమాపక దళం రంగంలోకి దిగాయి.












Click it and Unblock the Notifications