నిర్భయ దోషులను ఉరితీయడం గొప్ప రిలీఫ్.. : తలారి పవన్ జల్లాద్
నిర్భయ కేసులో దోషులకు పటియాలా కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరిశిక్షను అమలుచేయనున్నారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్లోని మీరట్కి చెందిన తలారి పవన్ జల్లాద్ను రప్పించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తీహార్ జైలు నుంచి తనకెలాంటి అధికారిక సమాచారం రాలేదని పవన్ వెల్లడించాడు. కానీ నిర్బయ దోషులకు ఉరిశిక్షను అమలుచేయడం ఆమె తల్లిదండ్రులతో పాటు తనకు,మొత్తం సమాజానికి గొప్ప ఉపశమనం కలిగిస్తుందన్నాడు.

ఉరితీసేందుకు సిద్దం : పవన్ జల్లాద్
ఉరితీతకు సంబంధించి ఇప్పటికైతే ఎవరూ తనను సంప్రదించలేదని పవన్ తెలిపాడు. ఒకవేళ ఎవరైనా తనను సంప్రదిస్తే.. ఉరి తీసేందుకు తాను సిద్దమన్నారు. గతేడాది డిసెంబర్ 16న ఉరితీతకు సంబంధించి తనకు సమాచారం ఇచ్చారని,ఆపై మళ్లీ ఎటువంటి స్పందన లేదని చెప్పుకొచ్చాడు.

నాలుగో తరం వాడిని.. :
తమ తాత లక్ష్మణ్ జల్లాద్,తండ్రి కలు రామ్ల తర్వాత తాను కూడా తలారి వృత్తిలో కొనసాగుతున్నానని,తాను నాలుగో తరం వాడినని పవన్ తెలిపాడు. వారి నుంచే తాను ఉరితీసే పద్దతి గురించి తెలుసుకున్నట్టు చెప్పాడు. అదేమీ అంత సులువైన వ్యవహారం కాదని,ఉరితీసే సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే.. దోషి విపరీతమైన నొప్పితో విలవిల్లాడుతున్నాడని చెప్పాడు.

ప్రాక్టీస్ అవసరం లేదు :
ఉరితీసేందుకు తనకెలాంటి ప్రాక్టీస్ అవసరం లేదని పవన్ అన్నాడు. ఉరితీసే ముందు ఒకసారి ఆ ప్రదేశంతో పాటు ఉరికంభాన్ని పరిశీలిస్తానని చెప్పాడు. అలాగే దోషికి సంబంధించిన కొలతలు తీసుకుని,దానికి తగ్గట్టుగా తాడు ఇతరత్రా సిద్దం చేస్తానని తెలిపాడు.

నలుగురికి ఉరిశిక్ష :
నిర్భయ ఘటన జరిగిన ఏడేళ్ల తర్వాత దోషులకు ఉరిశిక్ష అమలుచేయబోతున్నారు. డిసెంబర్ 16,2012 అర్ధరాత్రి ఆరుగురు వ్యక్తులు ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ డిసెంబర్ డిసెంబర్ 29న సింగపూర్లోని ఎలిజబెత్ ఆసుపత్రిలో నిర్భయ కన్నుమూసింది. దోషుల్లో ఒకరు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా,మరొకరు మైనర్ కావడంతో జువైనల్ హోమ్కు తరలించారు. అక్కడ మూడేళ్ల శిక్ష తర్వాత అతన్ని విడిచిపెట్టారు. మిగిలిన నలుగురిని ఈ నెల 22న ఉరితీయబోతున్నారు.












Click it and Unblock the Notifications