ఆసక్తికరం: శశికళ వ్యూహంలో రెండో ఆలోచన, తెరపైకి పన్నీరు వెనుక..
ఈ నెల 29వ తేదీన అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేపట్టవచ్చునని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఆమె ఏమీ స్పందించడం లేదు.
చెన్నై: ఈ నెల 29వ తేదీన అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేపట్టవచ్చునని జోరుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయమై ఆమె ఏమీ స్పందించడం లేదు. ఇందుకు ఓ కారణం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
శశికళ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పార్టీలో మెజార్టీ నేతలు సుముఖంగా ఉన్నారు. ఒకరిద్దరు నేతలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ శశికళ మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె మనసులో మరో ఆలోచన ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రజల ఆమోదం పొందాలంటే 2019 లోకసభ ఎన్నికల వరకు వేచి చూడాలని ఆమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు ఆ పదవి ఖాళీగా ఉంటుందని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. మరికొందరు సీనియర్ నేతలు మాత్రం దీనిని ఖండిస్తున్నారు.
అధినేత్రి లేకుండా..
అధినేత లేకుండా మరో మూడేళ్లు నడపడం సరికాదని, జయలలిత మృతి కారణంగా ఖాళీ ఏర్పడిన ఆర్కే నగర్కు ఆరు నెలల్లో ఎన్నికలు జరగవచ్చునని, అక్కడి నుంచి పోటీ చేసి ప్రజామోదం పొంది పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టవచ్చునని అంటున్నారు.
29న సమావేశం
కాగా, పార్టీ సర్వసభ్య సమావేశం ఈ నెల 29వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి వరకు శశికళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మరోవైపు ఆమెకు ముఖ్య నేతల నుంచి మద్దతు ఉండగా, కిందిస్థాయి నేతల నుంచి మాత్రం వ్యతిరేకత వస్తోంది.
తీర్మానాలు
ఇదిలా ఉండగా, శశికళకు పట్టం కట్టాలని ఆ పార్టీ సీనియర్ నేతలు పలువురు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ మధుసూదనన్ సహా పలువురు మంత్రులు, పలు జిల్లాల కార్యదర్శులు ఈ మేరకు తీర్మానాలు కూడా చేశారు.
సవరణలకు..
శశికళకు అనువుగా ప్రధాన కార్యదర్శి పదవి నిబంధనల్లో సవరణలు చేసేందుకు రంగం కూడా సిద్ధమయింది. 29వ తేదీన జరగనున్న ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక తీర్మానాలు చేయవచ్చని, శశికళను ప్రధాన కార్యదర్శిగా ప్రకటించవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. శశికళకు పార్టీ పగ్గాలు అప్పగిండచంపై పార్టీలోని కింద స్థాయి నాయకులు, కార్యకర్తల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
పన్నీరు సెల్వం పేరు తెరపైకి
పన్నీరు సెల్వంను ప్రధాన కార్యదర్శిగా ప్రకటించాలనే కొత్త నినాదం తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్సెల్వాన్నే ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేద్దామని పలు జిల్లాల్లో పోస్టర్లు సైతం వెలిశాయి. విళుపురం జిల్లా అవలూర్పేట్టైలో పట్టణ అన్నాడీఎంకే కార్యదర్శి సాదిక్ బాషా ఏర్పాటు చేసిన బ్యానరులో 'జయ సూచించిన పన్నీర్సెల్వమే నాయకత్వాన్ని చేపట్టి పార్టీని నడిపించాల'ని పిలుపునిచ్చారు.
శశికళకు షాక్.. పన్నీరుకు మద్దతుగా..
మరికొన్ని జిల్లాల్లోనూ ఇలాంటి బ్యానర్లు ప్రత్యక్షమయ్యాయి. ఎంజీఆర్ బంధువు సుధా విజయ కుమార్ కూడా పన్నీరు సెల్వంనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. ఓవైపు శశికళకు వ్యతిరేకంగా, మరోవైపు పన్నీర్ సెల్వానికి మద్దతుగా కార్యకర్తల్లో చీలికలు వస్తుండటంతో అది పార్టీపై ప్రభావాన్ని చూపనుందని చిన్నమ్మ అనుచరవర్గం ఆందోళన చెందుతోంది. శశికళను వ్యతిరేకించడం కోసమే పన్నీర్ సెల్వం పేరును తెరపైకి తీసుకొచ్చినట్టు కొందరు భావిస్తున్నారు.
అప్పుడు కూడా ఇలాగే..
తమిళనాడులో బలోపేతమైన పార్టీగా అనతికాలంలోనే పరిణామం చెందిన అన్నాడీఎంకేలో గతంలోనూ సంక్లిష్ట పరిస్థితులు తలెత్తాయి. ఆ పార్టీ వ్యవస్థాపకుడు, అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ 1987 డిసెంబరు 24వ తేదీన మరణించారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయమై పార్టీ రెండుగా చీలిపోయింది.
రెండు గ్రూపులు..
ఎమ్మార్ వీరప్పన్ మద్దతుతో ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్, 33 మంది ఎమ్మెల్యేల మద్దతులో జయలలిత వర్గాలు ఏర్పడ్డాయి. జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా స్వల్పకాలం వ్యవహరించినప్పటికీ 1989లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు పోటీ చేశాయి.