యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసి! ఇంటర్నెట్లో పెడుతానని బ్లాక్ మెయిల్..
మాజీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. ఓ 21సంవత్సరాల యువకుడు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. అప్పటికే యువతి వద్ద నుంచి రూ.8లక్షల వరకు కాజేసిన అతగాడు.. మరిన్ని డబ్బులు కావాలంటూ వేధించడంతో
చెన్నై: మాజీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. ఓ 21సంవత్సరాల యువకుడు బ్లాక్ మెయిలింగ్కు పాల్పడ్డాడు. అప్పటికే యువతి వద్ద నుంచి రూ.8లక్షల వరకు కాజేసిన అతగాడు.. మరిన్ని డబ్బులు కావాలంటూ వేధించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో తీగ లాగిన పోలీసులు నిందితుడి బండారం బయటపెట్టారు.
పోలీసుల కథనం ప్రకారం.. కడలూరుకు చెందిన అమలేష్ అనే యువకుడు.. డిప్లోమా పూర్తి చేసుకున్న తర్వాత చెన్నైలోని వలసరవక్కం ప్రాంతంలో ఉన్న కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో మరో ముగ్గురు స్నేహితులు గోకుల్, రుద్ర మరియు మైకెల్ లతో కలిసి ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాడు.
ఇదే క్రమంలో ఫేస్ బుక్ ద్వారా అమలేష్ కు ఓ కాలేజీ విద్యార్థిని పరిచయమైంది. వెస్ట్ సైదాపేటకు చెందిన ఆ విద్యార్థినితో తరుచుగా మాట్లాడుతుండేవాడు. 2014లో ఏర్పడిన ఈ పరిచయం.. క్రమంగా ప్రేమకు దారితీసింది. సాన్నిహిత్యం పెరగడంతో ఇద్దరి మధ్య చనువు ఏర్పడింది. అమలేష్ చాలాసార్లు ఆ యువతితో సెల్ఫీలు దిగాడు.
ఇలా ఒక సంవత్సరం గడిచిపోయాక.. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అమలేష్ తన ప్రేమ నాటకాన్ని బయటపెట్టుకున్నాడు. యువతిని డబ్బు కోసం వేధించడం మొదలుపెట్టాడు. ఇవ్వని పక్షంలో తనతో దిగిన సెల్ఫీలను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్ లో పెడుతానని బెదిరించాడు. అమలేష్ కు తోడు అతని స్నేహితులు కూడా ఆమెను డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టారు. ఇలా తన ఐఫోన్, ల్యాప్ టాప్, పలు విలువైన వస్తువులను యువతి వారికి ఇచ్చింది.
యువతి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. అమలేష్ తో సహా అతని స్నేహితులు మరింతగా రెచ్చిపోయారు. డబ్బు కావాలంటూ పదేపదే వేధించడం మొదలుపెట్టారు. దీంతో గత్యంతరం లేని స్థితిలో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు నమోదు చేసింది. ఇప్పటివరకు బాధితురాలి వద్ద నుంచి నిందితులు రూ.8లక్షల వరకు రాబట్టినట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 120 (B),384,564(i) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.