మరాఠాలకు విద్యా ఉద్యోగవకాశాల్లో 16శాతం రిజర్వేషన్: బిల్లు పాస్ చేసిన ఫడ్నవీస్ సర్కార్
మహారాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్రప్రభుత్వం కీలక బిల్లును పాస్ చేసింది. మరాఠీలలో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి విద్యా ఉద్యోగవకాశాల్లో 16శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లును అందరి ఏకాభిప్రాయంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా పాస్ చేసింది. అంతకు ముందు ఈ బిల్లు పాస్ చేయడంలో సహకరించిన విపక్ష పార్టీలకు సీఎం ఫడ్నవీస్ ధన్యవాదాలు తెలిపారు.
మరాఠీల్లో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల వారికి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 16శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ముందుగా రిజర్వేషన్ల సాధ్యసాధ్యాలపై వెనకబడిన తరగతుల కమిషన్ ఇచ్చిన రిపోర్టును సభ ముందు ఉంచారు. ఆ తర్వాత ఆ రిపోర్టు సూచనలను సభలో వివరించి అనంతరం బిల్లు పాస్ చేయించారు.
మరాఠీలు సామాజిక మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతి పౌరులుగా ఉన్నారని రిపోర్టు పేర్కొంది. అంతేకాదు పలు ప్రభుత్వ సర్వీసుల్లో వీరి శాతం చాలా తక్కువగా ఉందని రిపోర్టులో పేర్కొంది రాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్. అంతేకాదు వారు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(4) ప్రకారం వీరు రిజర్వేషన్లకు అర్హులు అవుతారని రిపోర్ట్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్న పరిస్థితుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కమిషన్ సూచనలు చేసింది. ఈ సూచనలు చదివి వినిపించిన తర్వాత బిల్లును ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సభలో ప్రవేశపెట్టారు.
ఇదిలా ఉంటే మహారాష్ట్రలో మరాఠాలు 30 శాతం ఉన్నారు. వీరు విద్యాసంస్థల్లో అడ్మిషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గతకొంత కాలంగా కోరుతున్నారు. ఈ ఏడాది జూలై, ఆగష్టు నెలల్లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం వెంటనే కమిటీ వేసి దీనిపై చర్చించి అన్ని పార్టీల సహకారంతో బిల్లును పాస్ చేసింది.